సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ అరెస్టు!
ఆయన డైరెక్షన్లో సికింద్రాబాద్లో విధ్వంసం..ఆధారాల సేకరణ
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): సైనిక కొలువుల్లో అగ్నిపథ్ స్కీమును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చెలరేగిన విధ్వంసాన్ని ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా కంభంలో రైల్వేపోలీసులు అరెస్టుచేశారు. విచారణ నిమిత్తం నరసరావుపేట పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించటం లేదు. కంభం మండలం తురుమెళ్లకు చెందిన సుబ్బారావు ఆర్మీలో నర్సింగ్ అసిస్టెంట్గా చేరి అధికారి హోదాలో 2012లో రిటైరయ్యారు.
2014లో గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీని ప్రారంభించారు. దీనికి హైదరాబాద్లోనూ బ్రాంచి ఉన్నది. రెండేండ్లుగా కరోనా కారణంగా ఎవరూ శిక్షణ తీసుకొనేందుకు రాకపోవడంతో అకాడమీ నిర్వహణ భారంగా మారింది. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ ఆర్మీ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో హైదరాబాద్ కార్యాలయాన్ని ఇటీవల మూసేశారు. అప్పటినుంచి కేంద్రంపై సుబ్బారావు అసహనంతో ఉన్నారు. అగ్నిపథ్ స్కీమును వ్యతిరేకిస్తున్న సైనిక అభ్యర్థులను రెచ్చగొట్టి సికింద్రాబాద్లో విధ్వంసానికి కుట్రచేసినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్స్, 17/6 గ్రూప్తో పాటు పలు పేర్లతో ఏర్పాటైన వాట్సాప్ గ్రూపుల్లో అల్లర్లను ప్రేరేపించేలా సంభాషణలు జరిగాయని ఇప్పటికై వైరల్ అయ్యాయి. సుబ్బారావుతో మరికొన్ని అకాడమీల యజమానులు అభ్యర్థులను రెచ్చగొట్టడంతోపాటు దాడికి పురిగొల్పినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి భో జనం, వసతి కల్పించినట్టు సమాచారం. కరీంనగర్లోని ఓ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడి పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.