మహబూబ్నగర్ : విద్యావేత్తగా, సాహిత్యవేత్తగా, అనువాదకుడిగా ప్రఖ్యాత గాంచిన జలజం సత్యనారాయణ సాహితి సవ్యసాచి అని వక్తలు కొనియాడారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జె.జె.ఆర్. ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రసిద్ధ కవి, రచయిత, అనువాదకుడు జలజం సత్యనారాయణ సంస్మరణ సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. జలజం సాహిత్యవేత్తగా గొప్పపేరు తెచ్చుకున్నారన్నారు. జిల్లా కేంద్రంలో విద్యాసంస్థను స్థాపించి ఎందరో విద్యార్థులకు మార్గదర్శనం చేశారని తెలిపారు. ఆయన మరణం పాలమూరు విద్యారంగానికి తీరనిలోటన్నారు.
సభకు హాజరైన ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు జలజం చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అలాగే ప్రసిద్ధ చిత్రకారులు కూరెళ్ళ శ్రీనివాస్ చిత్రించిన జలజం చిత్రపటాన్ని ఆయన జలజం కుటుంబ సభ్యులకు అందజేశారు.
జలజంపై రూపొందించిన జలజం వైబ్ సైట్ ను సామాజికవేత్త, తెలంగాణ హిస్టరీ సొసైటీ అధ్యక్షులు మణికొండ వేదకుమార్ ఆవిష్కరించారు.
కాళోజీతో జలజానికి ఉన్న అనుబంధాన్ని వీడియోరూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రముఖ కవులు కోట్ల వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, జగపతిరావు, రావూరి సూర్యనారాయణ, ఎస్. విజయకుమార్, జయరాములు, జలజం కళాశాల కరస్పాండెంట్ రమేష్ గౌడ్, జలజం కుటుంబ సభ్యులు సుషుమ్నరాయ్, వైశుషిరాయ్, విదుషీరాయ్, నాతి రవిచందర్, దామోదర్, లిటిల్ స్కాలర్స్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.