హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ప్రీలాంచ్ పేరిట ప్రజల నుంచి రూ.1164 కోట్లు వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ మోసాలపై దర్యాప్తు ముమ్మరం చేసినట్టు హైదరాబాద్ నగర క్రైమ్స్ అండ్ సిట్ విభాగం జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. 2022 ఆగస్టులో నగరానికి చెందిన యశ్వంత్తో పాటు మరో 240 మంది బాధితులు సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎండీపై ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం పలువురు బాధితులను పిలిచి వివరాలను వెల్లడించారు. డైరెక్టర్లు, 22 మంది మార్కెటింగ్ టీమ్తో కలిసి లక్ష్మీనారాయణ సుమారు 1752 మందిని మోసం చేసినట్టు విచారణలో తేలిందని జేసీపీ తెలిపారు. లక్ష్మీనారాయణ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ‘సాహితీ సర్వని ఎలైట్’ పేరిట 32 అంతస్థులు, 10 టవర్లతో ప్రాజెక్ట్ ప్రారంభించాడని చెప్పారు. 2019-22 మధ్యకాలంలో పలువురి నుంచి రూ.504 కోట్లు తీసుకొని చేతులెత్తేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మొత్తం 9 ప్రాజెక్టుల పేరిట రూ.1164 కోట్లు వసూలు చేసినట్టు వివరించారు. నిందితుడిపై వివిధ ప్రాంతాల్లో మొత్తం 50 కేసులు నమోదై ఉన్నట్టు తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని 41 కేసులు ఉన్నట్టు చెప్పారు.