హైదరాబాద్ : హైదరాబాద్ లో టీటీడీ తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో రెండవ రోజు బుధవారం శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర నిర్వహించారు. భోగశ్రీనివాసమూర్తి, విష్వక్సేనుడితోపాటు, శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసస్వామి వారికి వెయ్యి కలశాలతో సహస్రకలశాభిషేకం నిర్వహించారు.
పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనము తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. విశేషహోమం నిర్వహించారు. వైభవోత్సవాల్లో భాగంగా రేపు తిరుప్పావడ సేవను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు.