హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): మహిళలు, చిన్నారుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. మహిళా భద్రతే ప్రధానాంశంగా సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాద్లో ఏడు లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. నేర పరిశోధనలో సాంకేతికతను వినియోగిస్తూ సంచలన కేసులను సైతం 48 గంటల్లోనే ఛేదిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో నేరం చేస్తే తప్పక పట్టుబడతామన్న భయాన్ని నేరస్థుల్లో తెచ్చామని చెప్పారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం కార్యాలయంలో ఏర్పాటుచేసిన షీ భరోసా సైబర్ ల్యాబ్ను మంగళవారం మహేందర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు, నేర పరిశోధనలో క్షేత్రస్థాయి సిబ్బందికి షీ భరోసా సైబర్ ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. 2014 నుంచి 2020 వరకు కన్విక్షన్ రేటు (నేరస్థులకు శిక్షల ఖరారు శాతం)ను 58 శాతానికి పెంచినట్టు వెల్లడించారు. స్థానిక మహిళలతోపాటు ఉద్యోగరీత్యా రాష్ర్టానికి వచ్చే మహిళలు సైతం హైదరాబాద్ను అత్యంత సురక్షితంగా భావిస్తుండటం తెలంగాణ పోలీస్కు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. మహిళా భద్రతా విభాగం ఇంచార్జి అడిషనల్ డీజీ స్వాతిలక్రా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 331 షీటీమ్స్ పనిచేస్తున్నట్టు తెలిపారు. మహిళా భద్రతా చర్యలపై రూపొందించిన పుస్తకాలను ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్భగవత్, స్టీఫెన్ రవీంద్ర, ఐజీ శివశంకర్రెడ్డి, డీఐజీ సుమతి, సీఐడీ ఎస్పీ రెమారాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.