ఇచ్చోడ, ఆగస్టు 30: దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని మరాఠీ మహాకవి అన్నాభావు సాఠే మనవడు సచిన్ సాఠే కొనియాడారు. తెలంగాణ పథకాలు దేశమంతటా అమలైతే దళితుల ప్రగతి సాధ్యమవతుందని పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామాన్ని సందర్శించారు. అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. దళితుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాము కూలి పనులు చేసుకుంటూ ఉపాధి పొందేవారమని, ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు మూడు ఎకరాల చొప్పున భూమిని ఉచితంగా పంపిణీ చేశారని దళితులు తెలిపారు.
ఇప్పుడు ఆ భూముల్లో రెండు పంటలు సాగుచేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూమి విలువ ప్రస్తుతం రూ.50 లక్షలకు చేరుకున్నదని వెల్లడించారు. ఈ సందర్భంగా సచిన్ సాఠే మాట్లాడుతూ.. దళితుల పట్ల మహారాష్ట్రలో వివక్ష కొనసాగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో దళితుల కోసం ప్రకటించిన పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు మహారాష్ట్రలో కూడా అమలుకావాలంటే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండాలని ఆకాంక్షించారు. అభివృద్ధిలో మహారాష్ట్రతో పోల్చుకుంటే తెలంగాణ అన్ని రంగాల్లో విశేషమైన ప్రగతి సాధించిందని, ఇక్కడి గ్రామాలు అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తున్నాయని కొనియాడారు. దళితబంధు ద్వారా రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పొగిడారు. తమ గ్రామాన్ని సందర్శించిన సచిన్ సాఠేని సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్ సన్మానించారు.