హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. మరే రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఉద్యోగార్థులకు కోచింగ్ ఇప్పిస్తున్నదని తెలిపారు. బుధవారం మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం నుంచి ఓయూ, కేయూ, శాతవాహన, మహత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు వర్సిటీల్లో ఉచిత శిక్షణను మంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం 80 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నదని, ఇలా ఒకేసారి ఇన్ని ఉద్యోగాలను ఏ రాష్ట్రంలో భర్తీ చేసిన దాఖలాలు లేవని చెప్పారు.
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకోలేని, గ్రామీణ, పేద విద్యార్థుల కోసమే ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే పోలీసు, విద్య, వైద్యారోగ్యశాఖల్లోని పోస్టులు, గ్రూప్ -1, 2, 3, 4 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఉచిత కోచింగ్కు చొరవ తీసుకొన్న ఉన్నత విద్యామండలి చైర్మన్, వర్సిటీ వీసీలను మంత్రి అభినందించారు. ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లల్లో అధిక ఫీజులపై అధికారులతో కమిటీ వేస్తాం. ఫీజులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తాం. ప్రభుత్వమే ఉచిత శిక్షణ ఇస్తున్నందున ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గుతుంది.
– మంత్రి సబితాఇంద్రారెడ్డి