రంగారెడ్డి, జూన్ 11 (నమస్తేతెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో అధికారులు బుల్డోజర్లను దించి ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న రైతులు ఎన్నో ఏండ్లుగా తాము చేసుకుంటున్న భూములను ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తూ బుల్డోజర్లకు అడ్డుగా కూర్చున్నారు. దీంతో అధికారులు పోలీసు అదనపు బలగాలు రంగంలోకి దించి రైతులను బలవంతంగా పక్కకు నెట్టేసి భూముల స్వాధీనానికి ప్రయత్నించారు.
గ్రామంలోని సర్వే నంబర్ 289 లోని సుమారు వంద ఎకరాల భూమి రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్కు అతి సమీపంలో ఉంది. ఈ భూమిని గతంలో ప్రభుత్వం హౌసింగ్బోర్డుకు ఇచ్చినట్టు చెప్తున్నారు. రెవెన్యూ, పోలీసు, హౌ సింగ్బోర్డు, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో బుధవా రం ఆ భూమిని స్వాధీనం చేసుకొనేందుకు యత్నించారు. ఉదయమే పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి, బుల్డోజర్లను దించారు.
ఈ విషయం తెలుసుకున్న రావిర్యాల గ్రామాల రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని జేసీబీలకు అడ్డుగా కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఆమె వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి.. ఎన్నో ఏండ్లుగా రైతులు సాగుచేసుకుంటున్న భూమిని ఎలాంటి నోటీసులివ్వకుండా ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. రైతులకు న్యా యం జరిగేలా చూడాలని, లేదంటే రావిర్యాల భూమిలో బైఠాయిస్తానని హెచ్చరించారు.
రావిర్యాల గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనంబర్ 289లో సుమారు 400ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయి. వాటిలో వంద ఎకరాలను ప్రభుత్వం హౌసింగ్బోర్డుకు అప్పగించినట్టు సమాచారం. సర్వేనంబర్ 73లో గల 53 ఎకరాల భూమిని రావిర్యాలకు చెందిన సుమారు 60 మంది రైతులు ఎన్నో ఏండ్లుగా సాగుచేసుకుంటున్నారు. ఆ సర్వేనంబర్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు పక్కనే ఉందని, అప్పటి అధికారులు చూపించి అక్కడే రైతులకు పట్టాలిచ్చారు.
ఆ భూమిని రైతులు సాగు చేసుకుంటున్నారు. ఇటీవల గ్రీన్ఫీల్డ్రోడ్డు భూసేకరణ కోసం ప్రభుత్వం ఈ రైతులకే నోటీసులు కూడా ఇచ్చింది. అయితే 73 సర్వేనంబర్లోగల భూమిని రైతులు సాగుచేసుకుంటున్నారని, కానీ ఆ భూమి 289 సర్వేనంబర్ పరిధిలోకి వస్తుందని అధికారులు చెప్తున్నారు. మరి 73 సర్వే నంబర్ ఎక్కడ వస్తుందో చూపించాలని రైతులు పట్టుబట్టారు. 73 సర్వేనంబర్ లేనే లేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. కానీ, 73 సర్వేనంబర్లో కాస్తుకాలంలో రైతుల పేర్లు వస్తుండటంతో పాటు పన్నులు కూడా చెల్లించారు. ఇప్పుడు ఈ భూములు 289 సర్వేనంబర్ పరిధిలోకి వస్తాయని అధికారులు వాదిస్తున్నారు. దీంతో ఈ వివాదం రోజంతా సాగింది.
రావిర్యాల గ్రామంలో ప్రభుత్వ భూమి ఎన్నో ఏండ్లుగా రైతులు సాగుచేసుకుంటున్నారని, ఆ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటే సహించేది లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. రైతులకు న్యాయం జరగకపోతే ఈ భూముల వద్దే బైఠాయిస్తామని అన్నారు. ఈ భూములను రైతులే సాగుచేసుకుంటున్నట్టు పహాణీ రికార్డులో కూడా ఉందని, అలాగే, పన్నులు కూడా చెల్లించినట్టు రసీదులున్నాయని తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నించటం సమంజసం కాదని అన్నారు. వెంటనే ఆ భూములను రైతులకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు.