హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) -1 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలను అక్టోబర్ 5 నుంచి 11 వరకు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి సూచించారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నిర్వహించే ఈ పరీక్షల షెడ్యూల్ను శనివారం ఆయన విడుదల చేశారు. అక్టోబర్ 30లోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి, ఫలితాలను ప్రకటించాలని పేర్కొన్నారు. అక్టోబర్ 31లోగా క్యుములేటివ్ రికార్డుల్లో నమోదుచేయాలని, నవంబర్ ఒకటిలోగా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి, విద్యార్థుల ప్రగతిని వెల్లడించాలని తెలిపారు.