హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులకు అండగా ఉంటుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉన్నదని, రైతులు ఆధైర్యపడొద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్రం సాయం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టంచేశారు. సోమవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మామిడి, మొక్కజొన్న, జొన్న, మిర్చి, వరి, కూరగాయలు సహా ఇతర పంటలకు నష్టం వాటిల్లిందని, పశువులు, గొర్రెలు, మేకలు చనిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటివరకు 80 వేల మంది రైతులకు సంబంధించి 1.50 లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లినట్టు జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇచ్చారని వెల్లడించారు.
పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలు కొనసాగుతున్నాయని, తుది నివేదికలు వచ్చాక ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చే విధంగా చర్యలు చేపడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఉద్యానవనశాఖ డైరెక్టర్ హనుమంతరావుతో కలిసి పంట నష్టంపై ప్రత్యక్ష పరిశీలన చేశామని చెప్పారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో పర్యటించామని తెలిపారు. కేంద్రం కూడా పంట నష్టాన్ని పరిశీలించేందుకు బృందాలను పంపాలని విజ్ఞప్తి చేశారు. గతం లో రూ.7 వేల కోట్ల పంట నష్టం జరిగితే రూ.250 కోట్ల సాయం చేసి కేంద్రం చేతులు దులుపుకున్నదని విమర్శించారు. కేంద్రానికి తెలంగాణ ప్రజలంటే కోపమని అందుకే సరిగా స్పందించడం లేదని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు అండగా ఉంటున్నారనే బీజేపీ ప్రభుత్వం కక్ష గట్టిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫసల్బీమా పథకం లోపభూయిష్టంగా ఉన్నదని, అది బీమా కంపెనీలకే తప్ప రైతులకు ఉపయోగపడేలా లేదని చెప్పారు. అందుకే గుజరాత్, పశ్చిమబెంగాల్, తెలంగాణ రాష్ర్టాలు ఈ పథకాన్ని అమలు చేయడంలేదని స్పష్టంచేశారు. తక్షణమే కేంద్రం కొత్త పథకం తేవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, కేపీ వివేకానంద పాల్గొన్నారు.