మధిర, జూన్ 28: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్రోడ్డు వద్ద ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహించాల్సిన రైతు మేళా వర్షం కారణంగా రద్దయింది. కాగా ఈ నెల 30న ‘రైతు ఆశీర్వాద సభ’ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది. దీనికి సీఎం రేవంత్రెడ్డి హాజరు కావాల్సి ఉన్నది.
శనివారం నాటి వర్షం కారణంగా సభా ప్రాంగణం వద్ద బురద ఏర్పడటంతో ఆదివారం జరుగాల్సిన రైతుమేళాను ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ రద్దు చేశారు. ఆదివారం కూడా భారీ వర్షం కురువడంతో సోమవారం నాటి రైతు మేళాను సైతం రద్దు చేస్తూ కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు. వర్షం నేపథ్యంలో సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని, ఈ నెల 30న సీఎం రేవంత్రెడ్డి పాల్గొనే రైతు ఆశీర్వాద సభ నిర్వహణ సాధ్యాసాధ్యాలను అంచనా వేసి నిర్ణయాన్ని వెల్లడిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.