నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రంలో రైతుబంధు సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. గురువారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. రైతులు స్వచ్ఛందంగా పాల్గొని వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో పల్లెల్లో సంక్రాంతికి ముందే పండుగొచ్చింది. నిర్మల్ జిల్లా లక్ష్మన్చంద, మామడ మండల కేంద్రాల్లో జరిగిన రైతుబంధు సంబురాల్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నారు. మామడలో ట్రాక్టర్ నడిపి రైతులతో కలిసి డప్పు కొట్టి, నృత్యం చేశారు. స్వయంగా రైతు అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడు అని మంత్రి అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాలతో మార్కెట్కు వచ్చిన వివిధ ఉత్పత్తులతో రైతుబంధు అక్షరమాలను రూపొందించి వినూత్నరీతిలో సంబురాలు జరుపుకొన్నారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని సోడషపల్లి రైతువేదిక వద్ద, ధర్మసాగర్ మండలం దేవునూరు, జానకీపురంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ఎడ్లబండిపై ర్యాలీగా వచ్చి, రైతుబంధుపై విద్యార్థులు, మహిళలు వేసిన ముగ్గులను తిలకించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని రైతువేదికలో రైతుబంధు వేడుకలు చేసుకొన్నారు. రూరల్ మండలంలోని చెర్లభూత్కూర్లో ఓ రైతు తన పొలంలో కేసీఆర్ అని నారుతో రాసి తన అభిమానాన్ని చాటుకొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా రైతుబంధు సంబురాలు ఘనంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ నాయకులు, రైతులు.. పొలాల్లో రైతుబంధు, జై కేసీఆర్ అక్షరమాలలో వరి నాట్లు వేసి హర్షం వ్యక్తం చేశారు. హాలియా మండలం రామడుగులో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి పాల్గొని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి ర్యాలీ తీశారు.