హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో అధికశాతం బీసీలు లబ్ధిపొందుతున్నారని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా రైతుబంధు పథకాన్ని ప్రారంభించాక అన్ని వర్గాలతోపాటుగా ప్రధానంగా బీసీ రైతులకు సాయం అందుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశా రు. సర్కారు దూరదృష్టిని అర్థం చేసుకోకుండా, సమాచార లేమితో అసత్య ప్రచారాలు చేయడం తగదని సూచించారు. బీసీ కమిషన్ చేపట్టిన సామాజిక ఆర్థిక స్థితిగతుల అధ్యయనంలో తేలిన గణాంకాలను వకుళాభరణం వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ రైతుల ఆధీనంలో 71.47 లక్షల ఎకరాలు, ఎస్సీ రైతుల ఆధీనంలో 13.53 లక్షల ఎకరాలు, ఎస్టీల ఆధీనంలో 19.29 లక్షల ఎకరాలు, ఇతర వర్గాల వద్ద 44.41 లక్షల ఎకరాల భూమి కలిగి ఉన్నట్టు చెప్పారు.
తాజా లెకల ప్రకారం 2018 నుంచి 2022 వరకు రైతుబంధు ద్వారా 34.81 లక్షల మంది బీసీ రైతులు (27,792.70 కోట్లు), ఎస్టీ రైతులు 8.24 లక్షల మంది (7,527.19 కోట్లు), ఎస్సీ రైతులు 8.54 లక్షలు (5,211 కోట్లు), ఇతరులు 13.41 లక్షల మంది (17,370.44 కోట్లు) రైతులు ఆర్థిక సాయం పొందారని తెలిపారు. బీసీ రైతులే అధికంగా లబ్ధి పొందినా అవగాహన లేకండా ఉన్నతవర్గాల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని విమర్శించడం దారుణమని మండిపడ్డారు.
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), అబ్దుల్ లతీఫ్ పావర్టీ ల్యాబ్ సర్వే ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 86.5 శాతం రైతులు రైతుబంధు పథకంపై సంతృప్తి తెలిపినట్టు చెప్పారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల జీవితాలు మారాయని, వారి జీవన ప్రమాణాలు పెరిగిన విషయాన్ని కేంద్రం కూడా గుర్తించాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మారిపోతుందని వకుళాభరణం వివరించారు.