హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): యాసంగి పంటల కొనుగోళ్లకు సిద్ధం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెట్లకు పంటలు తెస్తున్న రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, మార్క్ఫెడ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఏ పంటకైనా మద్దతు ధరకంటే తకువ వస్తే వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. అవసరమైతే సెలవు రోజుల్లో కూడా మిర్చి క్రయ విక్రయాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. 54,29,645 మంది రైతులకు రైతుబంధు సాయం ఇప్పటికే అందజేశామని, మిగతా వారికి త్వరలోనే అందజేస్తామని మంత్రి వివరించారు. సమావేశంలో ఏపీసీ సెక్రెటరీ రఘునందన్రావు, అగ్రికల్చర్ డైరెక్టర్ బీ గోపి, మారెటింగ్ డైరెక్టర్ జీ లక్ష్మీబాయి, మార్ఫెడ్ ఎంపీ సీహెచ్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.