Rythu Bima |రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అది. లచ్చయ్య గంగిరెద్దు లాడిస్తడు, లచ్చవ్వ ఊరూరా తిరిగి ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతది. చాలీచాలని సంపాదన. ముగ్గురు ఆడపిల్లలు.. చిరుగుపాతల బరువుతోని రోజులెల్లదీస్తుంటే యాక్సిడెంట్ లో లచ్చయ్య సచ్చిపోయిండు. లచ్చవ్వ ఒంటరిదైపోయింది. ఆదుకునేటోల్లు కాదు కదా.. అయ్యో అనేటోల్లు కూడా లేరు. పదేండ్ల కాపురంలో తినో తినకనో ఆలుమగలు 3లక్షలు కూడబెట్టిన్రు. ఆ సొమ్ముతో పిల్లల భవిష్యత్ కోసమని భూమి కొంటే గుంట కన్న తకువ జాగ వచ్చింది. గాయింత భూమికి కూడా కేసీఆర్ సర్కార్ రైతుబంధు ఇచ్చింది. లచ్చయ్యను రైతుగానే భావించి రైతుబీమా కింద ఐదు లక్షలిచ్చింది. కేసీఆర్ తెచ్చిన పథకాలతో ముగ్గురు ఆడబిడ్డల భవిష్యత్ కు భరోసా చిక్కింది. ఆ నిరుపేద తల్లికి కొండంత ధైర్యం వచ్చింది. సిరిమల్లె సెట్టు కింద సినబోయి కూసున్న లచ్చుమమ్మ కాదీమె.. గులాబీ సెట్టు కింద రైతుబీమాతో ధీమాగా కూసున్న లచ్చుమమ్మ.
‘అద్దాలు, దువ్వెన్లు, కాటుక డబ్బాలు, రబ్బరు బ్యాండ్లు.. ’ అనుకుంట రకరకాల సామాన్లు గంపల పెట్టుకోని కొడిమ్యాల మండలంలోని (జగిత్యాల జిల్లా) ఊళ్లన్నీ తిరుగుతది లచ్చవ్వ. ఉన్న రోజులు ఊళ్లనే కైకిలి పనికి పోతది. లేని రోజు గంపెత్తుకోని ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతది. లచ్చయ్య అయితే గంగిరెద్దులు ఆడియ్యనీకి పోతడు. లచ్చయ్య, లచ్చవ్వకు ముగ్గురు ఆడబిడ్డలు పుట్టిన్రు. ఊళ్లనే అమ్మ అయ్య ఇచ్చిన గుంటెడు జాగ తప్ప ఇల్లు లేదు వాళ్లకి. వెదురు గూన మీద ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పరిచి కాళ్లు ముడుచుకోని పడుకుంటరు ఆ ఇంట్ల. అంత చిన్న ఇంట్ల బతికే లచ్చవ్వకు గ్యాస్ మొద్దు గూడ లేదు. ఇంట్ల ఒక్క కరెంటు బుగ్గ తప్ప ఇంకేమీ లేదు. లీడర్లు బజార్లల్ల కట్టే ఫ్లెక్సీలు తెంపుకొచ్చి బాత్రూమ్ లెక్క కట్టుకున్నరు. ఆమె నెత్తిన గంపలో ఎన్ని ప్లాస్టిక్ సామాన్లు ఉంటయో, ఆ ఇంట్ల అన్ని పాత్రలుంటయి. అంత పేదరాలు అయితేనేం? కడుపుకట్టుకోని పైసా పైసా దాచింది. పైైళ్లెన కాంచెల్లి కష్టపడి సంపాదించిన డబ్బుని పెంపు జేయాల్నని చిన్న జాగ కొన్నరు. పదేండ్ల సంసారంలో మూడు లక్షలు పొదుపు జేసిండ్రు. ఆ పైసలతోని వ్యవసాయ భూమి కొనాలనుకున్నరు. మూడు లక్షలకు ఏమొస్తది తెలంగాణల? ‘మీ పెండ్లికి ముందు ఎకరం వచ్చునేమో? గానీ, ఇప్పుడు గుంట జాగ కూడా రాదు బిడ్డా’ అని పెద్దోళ్లన్నరు. ఆ పెద్దోళ్లు చెప్పినట్టే అయింది. రెండేళ్ల కింద పావు తక్కువ గుంట కొన్నరు. ఆ గింత భూమిల అరక కట్టేది లేదు. విత్తనం పెట్టేది లేదు. రేపటికి రేటు పెరిగితే బిడ్డల పెండ్లి చేయనీకి అక్కరకొస్తదని లచ్చయ్య, లచ్చవ్వ కలగన్నరు. కానీ, అట్ల గాలె. సావులకు బోయి గంగిరెద్దులు ఆడించే లచ్చయ్య ఇంటికే సావు కష్టమొచ్చింది. రోడ్డు మీద పోతాంటే యాక్సిడెంట్ అయింది. లచ్చయ్య సచ్చిపోయిండు. లచ్చవ్వ ఒంటరిదైపోయింది. ముగ్గురు బిడ్డల భారం ఒక్కతల్లి మీదనే పడ్డది. ఆ పేద తల్లికి అయిన వాళ్లు ఉన్నారు. కానీ, ఎవరూ సాయం జేసేంతటి వాళ్లు లేకుండె. అర్ధసంచారులైన గంగిరెద్దులోళ్ల బతుకులు అర్థం కోసం చేయి చాపి అడుక్కోవడమే. అడుక్కునేటోళ్లనే ఆమె ఏమని అడుక్కుంటుంది? పెద్దలుంటారు. కానీ, అయ్యాపాపమని లచ్చయ్య సచ్చిన రోజు అన్నోళ్లే. కానీ, ఎవ్వలూ సాయం జేయనీకి ముందుకు రాలే. ఆ ముగ్గురు బిడ్డల్ని ఆదుకోనీకి తామున్నమని మాట ఇయ్యలే. ‘ఈ బిడ్డల్ని ఎట్ల పెద్ద జెయ్యాలె లచ్చయ్యో’ అని ఆ పేద లచ్చవ్వ శవం మీద పడి ఏడుస్తాంటె.. చూసి కన్నీళ్లు పెట్టినోళ్లే కానీ, ఆమెకు అభయమిచ్చిన మాట ఇనపడలే. ఒడిలో ఉన్న బిడ్డల్ని చూసుకుంట..కొండగట్టు అంజన్నని, సిరిసిల్ల రాజన్నని వేడుకుంటూ శోకించే తల్లికి ఏ దేవుడు న్యాయం చేస్తాడో! పాపం అనుకుంటా చూసిన జనాలు పోయిన్రు.
దినాలు అయిపోయినయ్. లచ్చయ్య ఆడించిన ఎద్దుకు గడ్డెవలు తేవాలె? ఆడిచ్చేటోడు పోయిండు. ఎద్దుని మేపలేక అమ్మింది. పొద్దునే లేచి బిడ్డలను సవరిచ్చుడు. ఆళ్లని బడికి పంపి, ఆమె గంప నెత్తికెత్తుకోని కొడిమ్యాల మండలమంత తిరుగుతది. పిల్లల బడి అయిపోయే సరికి ఇంటికొస్తది. ఆలస్యమైతే అత్తమామ అండ ఉంది. అయిదో తరగతి దాంక ఇట్లనే కష్టపడి సదివిస్త. ఆ తర్వాత హాస్టల్ల ఎయ్యాల్నని అనుకుంటాంది లచ్చవ్వ. ఆ పేదింట్లో లచ్చవ్వ ఏడ్వని రాత్రి లేదు. నిద్రపట్టిన రోజు లేదు. ఆ పేదరాలికి అండ లేదు. గుండెను బండ చేసుకోని బతుకుతున్నది. నెల తిరిగే సరికి రైతు బీమా ఉందనే ధీమా ఆమె చెవిన పడింది. ‘దేవుడే పంపించిండో! దేవుడై సారొచ్చిండో! పావు తక్కువ గుంట జాగ ఉన్నందుకు రైతు బీమా వస్తదని సారోళ్లు చెప్పిన్రు. రైతు బంధు ఇచ్చినట్టే… ఇప్పుడు రైతు బీమా పైసలు బ్యాంకు అకౌంట్ల ఏస్తరని చెప్పిన్రు. మూడు లక్షలతోని కొన్న జాగ, చిన్న ఇల్లు కట్టుకునేంత జాగ అది. దానికి అయిదు లక్షలు ఇయ్యడమేందని మొదాలు నమ్మలేకున్న. పైసా లంచం ఇయ్యకుండనే వస్తదని మా ఊరి సర్పంచ్ చెప్పిండు. చెప్పినట్టే వచ్చింది. ఆ సారు సల్లంగుండ. నా బిడ్డల గోస తెలుసో, లేదో, ఈ బాధల బతుకుల ఉన్నందుకు ఇంత సాయం జేసిండు’ అని లచ్చవ్వ కన్నీళ్లు తుడుసుకుంట చెబుతున్నది. అయిదు లచ్చల లచ్చవ్వ ఇప్పుడేం జేస్తాంది? కొడిమ్యాల మండలమంతా తిరిగి మల్లా అదే ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతున్నది. వచ్చిన పైసల్తోని ఏదైనా చేయొచ్చుగా అంటే.. ‘సంపాదిచ్చేటోడు పోయిండు. బిడ్డలకి బువ్వెట్ట. చేసి పెట్టేటోల్లు ఎవలున్నరు? ఆ పైసలుంటే రేపేదైనా కష్టం వస్తే అక్కరకొస్తయ్. అందుకే తియ్యలే. ముగ్గురు బిడ్డల పేర తలా లక్ష రూపాయలు బ్యాంకుల పెట్టిన సారు. మిగిలిన రెండు లక్షలూ బ్యాంకులనే ఉన్నయ్. అయ్యి అట్లనే ఉండనీ.. పెంపు జేస్తే బిడ్డలకేగా మేలు’ అన్నది. పోతే కైకిలి పనికి. లేకుంటే అద్దాలు, దువ్వెన్లు అమ్ముకుంట తిరుగుతున్నది. గుండె చెదిరిన లచ్చవ్వకు కొండంత ధైర్యం రైతు బీమా. రేపేదైనా కష్టం వస్తే ఎట్ల బతకాలని సావు ఇంట్లో ఏడ్చిన లచ్చవ్వ ఇప్పుడు ఏ కష్టమొచ్చినా బ్యాంకుల పైసలున్నయని పొత్తిళ్లలో బిడ్డల్ని దాచుకుని ధైర్యంగా నిద్రపోతున్నది.
…? నాగవర్ధన్ రాయల, ఫొటోలు : గడసంతల శ్రీనివాస్