హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యవసాయరంగ అభివృద్ధిలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు (ఏఆర్ఎస్ఏ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. నాణ్యమైన ఎరువులు, విత్తనాలను సరైన సమయంలో, తక్కువ ధరకు అందిస్తూ రైతులకు మేలు చేస్తున్నాయి. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభుత్వం 2019లో ఏఆర్ఎస్ఏల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వరంగ సంస్థ ఆగ్రోస్ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసింది. ప్రతి మండలానికి మూడు చొప్పున 1,050 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒకప్పుడు రైతులు ఎరువుల కోసం దగ్గర్లోని పట్టణాలకు వెళ్లేవారు. ఏఆర్ఎస్ఏల ఏర్పాటుతో గ్రామాల్లోనే రైతులకు ఎరువులన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఈ కేంద్రాల ద్వారా ఏడు రకాల సేవలు అందిస్తున్నారు. మిగిలిన ఎరువుల షాపులతో పోల్చితే ఏఆర్ఎస్ఏలలో తక్కువ ధరకే ఎరువులు లభిస్తున్నాయి.
ఉపాధికి బాట.. సొంత వ్యాపారం
ఏఆర్ఎస్ఏలతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరింది. గ్రామాల్లో చదువుకొని ఖాళీగా ఉన్న యువతను గుర్తించి, వారికి ఏఆర్ఎస్ఏలను కేటాయించింది. 1,050 కేంద్రాల ఏర్పాటుతో కేంద్రానికి ఒకరు చొప్పున 1,050 మంది తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రతి కేంద్రంలోనూ కనీసం ముగ్గురి నుంచి ఐదుగురికి ఉపాధి లభిస్తున్నది. ఈ లెక్కన ప్రత్యక్షంగా సుమారు 5 వేల మంది ఉపాధి పొందుతున్నారు. మరింత మందికి ఉపాధి కల్పించేందుకు మిల్లెట్ వ్యాపారంలోకి దిగాలని ఆగ్రోస్ నిర్ణయించింది. ఏఆర్ఎస్ఏల ఏర్పాటు కోసం సబ్సిడీతో కూడిన రుణాలను ఇప్పిస్తున్నది. వ్యాపా ర స్థోమతను బట్టి రూ.10-20 లక్షల వరకు రుణమిచ్చేందుకు ఎస్బీఐ,నాబార్డ్, హెచ్డీఎఫ్సీలతో ఆగ్రోస్ ఒప్పందం కుదుర్చుకొన్నది.
రైతులకు మేలు
ఏఆర్ఎస్ఏలతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. వీటిని స్థానికంగా ఏర్పాటుచేయడంతో రైతులకు ఎరువులు, విత్తనాలు చేరువయ్యాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తున్నాయి. ముఖ్యంగా యువతకు ఉపాధి లభిస్తున్నది. ఆగ్రోస్కు స్కోచ్ అవార్డు దక్కడం అభినందనీయం.
– రఘునందన్రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి
ఐదుగురికి ఉపాధి కల్పిస్తున్న
మాది గద్వాల జిల్లా కోదండాపూర్. మా గ్రామంలో మూడేండ్లుగా ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాను. దీని ఏర్పాటుతో నాకు ఉపాధి లభించడంతోపాటు మరో ఐదుగురికి కూడా పని కల్పిస్తున్నాను. కేంద్రం ఏర్పాటు కోసం నాకు రూ.20 లక్షల రుణం అందించారు. ఇందులో రూ.8.8 లక్షలు సబ్సిడీ వచ్చింది. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సరైన సమయంలో తక్కువ ధరకు, చేరువలో లభిస్తున్నాయి. రైతులు మా కేంద్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.
– మల్లీశ్వరి, రైతు సేవా కేంద్రం నిర్వాహకురాలు, గద్వాల