హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ గుర్తింపు పొందిన కాలేజీలు, అటానమస్ కాలేజీలు రూల్స్ 2022 (ఆర్22) నిబంధనలను తప్పక పాటించాలని వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ ఆదేశించారు. నాణ్యమైన విద్యా బోధన అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతోనే ఈ రూల్స్ తెచ్చామని తెలిపారు. ముఖ్యంగా ప్రైవేటు కాలేజీల్లో క్వాలిఫైడ్ టీచింగ్ సిబ్బంది లేకపోవడం వల్ల విద్యాబోధనలో కొంత హెచ్చుతగ్గులు వస్తున్నాయని పేర్కొన్నారు.
అటానమస్ కాలేజీలు సొంత సిలబస్, పరీక్షల పేరుతో నాణ్యతా ప్రమాణాలు తగ్గించుకొంటున్నాయని చెప్పారు. పెద్ద కంపెనీలు, పరిశ్రమలకు తగినట్టుగా ఆయా కాలేజీల్లో చదివిన విద్యార్థుల్లో నైపుణ్యాలు కనిపించడం లేదని యూనివర్సిటీ గుర్తించినట్టు ఆయన వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై చర్యలు తీసుకొంటామన్నారు. అటానమస్ కాలేజీలలో ఏర్పాటు చేసే బీవోఎస్లో జేఎన్టీయూ ప్రతినిధి ఉండాలని సూచించారు.