హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ సిబ్బందిపై కొందరు దాడులకు దిగడాన్ని సంస్థ తీవ్రంగా ఖండించింది. ప్రతిరోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న సిబ్బందిని దుర్భాషలాడుతూ దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొ ంది. ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటం కం కలిగించే, దాడులకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలుంటాయని, నేరస్థులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిం ది. సిబ్బందిలో ఆత్మైస్థెర్యం దెబ్బతీసే ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏ మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేసింది.
ముగ్గురు కండక్టర్లపై మహిళల దాడులు
కండక్టర్లపై ఇటీవల మూడుచోట్ల మహిళలు దాడులకు దిగారు. హయత్నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లను దుర్భాషలాడుతూ వేర్వేరుగా దాడికి దిగారు. చిల్లర విషయంలో ఓ మహిళ, గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ను తీసుకోవాలని కండక్టర్ చెప్పినందుకు మరో మహిళ కండక్టర్లను దూషించారు. పికెట్ డిపోనకు చెందిన మహిళా కండక్టర్పై యాదగిరిగుట్టలో కొందరు మహిళలు సామూహికంగా దాడి చేశారు. ఈ ఘటనలపై ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు జరుగుతున్నది.
ఫిర్యాదులకు వ్యవస్థ ఏర్పాటు
ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సమస్యలను సంస్థ దృష్టికి తీసుకొచ్చేందుకు బస్భవన్లో పటిష్టమైన వ్యవస్థను సంస్థ ఏర్పాటు చేసింది. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా 040-69440000, 040-23450033ను అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదులను సోషల్ మీడియా ద్వారా సంస్థ దృష్టికి తీసుకురావచ్చని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. అలాగే, నేరుగా సమీపంలోని డిపో కార్యాలయాలకు వెళ్లి వివరించవచ్చని సూచించారు. ఫిర్యాదు సంస్థ దృష్టికి తెస్తే, వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని, సహనం కోల్పోయి దాడులకు పాల్పడటం సరైంది కాదని సంస్థ సూచించింది.