హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీకి రక్షాబంధన్ కలిసొచ్చింది. సంస్థకు గురువారం ఒక్కరోజే రూ.22.65 కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్టైం రికార్డు. నిరుడు రాఖీపండుగ రోజు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా, ఈ ఏడాది అదనంగా రూ.కోటి ఆర్జించింది. ఈ రాఖీపౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో 40.92 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. నిరుడు కన్నా లక్ష మంది ప్రయాణికులు అదనంగా ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించడం విశేషం. ఒక రోజులో ఇంత పెద్దఎత్తున బస్సు సర్వీసుల్లో ప్రయాణించడం ఇదే తొలిసారి. గత రాఖీ పండుగతో పోల్చితే 1.23 లక్షల కిలోమీటర్లు అదనంగా ఈసారి ఆర్టీసీ బస్సులు తిరిగాయి. 2022లో రాఖీపండగ రోజు 35.54 లక్షల కిలోమీటర్లు తిరగగా, ఈసారి 36.77 లక్షల కిలోమీటర్లు నడిచాయి.
నిరుటి రికార్డును తిరగరాసిన నల్లగొండ
రాష్ట్రంలోని 20 ఆర్టీసీ డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ నమోదైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నిరుటి రికార్డును తిరగరాసింది. 2022లో రాఖీ పండుగ రోజు 101.01 ఓఆర్ సాధించగా, ఈసారి 104.68 శాతం రికార్డు ఓఆర్ నమోదైంది. ఆ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో నార్కట్పల్లి మినహా మిగతా డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 డిపోలు ఉండగా, 6 డిపోలు 100కిపైగా ఓఆర్ సాధించడం విశేషం. ఉమ్మడి మెదక్, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓఆర్ నమోదైంది. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో అత్యధికంగా ఒక కిలోమీటర్కు రూ.65.94ను వరంగల్-1 డిపో, రూ.65.64ను భూపాలపల్లి డిపో సాధించింది. ఈ రెండు కూడా సంస్థ చరిత్రలోనూ ఎర్నింగ్స్ ఫర్ కిలోమీటర్ (ఈపీకే) ఆల్ టైం రికార్డు నమోదు చేయడం గమనార్హం.
ప్రజల ఆదరణ, సర్కారు ప్రోత్సాహమే స్ఫూర్తి:మంత్రి పువ్వాడ, చైర్మన్, ఎండీ
ప్రజల ఆదరణ, ప్రభుత్వ ప్రోత్సాహన్ని స్ఫూర్తిగా తీసుకొని రెట్టింపు ఉత్సాహంతో ఉద్యోగులు పనిచేసి ఈ రికార్డు సాధించారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్ కొనియాడారు. ఆర్టీసీ చరిత్రలో ఒక రోజులో రూ.22.65 కోట్ల రాబడి రాలేదని తెలిపారు. నిరుడు రాఖీపౌర్ణమిన 12 డిపోలు 100%పైగా ఓఆర్ సాధించగా, ఈసారి 20 డిపోలు నమోదు చేశాయని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు పండుగను త్యాగం చేసి విధులు నిర్వర్తించారని, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.