తెలంగాణచౌక్/రుద్రంగి, జనవరి 12: ఆర్టీసీ పందెం కోడి(Pandem kodi) కథ సుఖాంతమైంది. ఈ నెల 9న ఆర్టీసీ బస్సు(RTC officials)లో డిపో-2 సెక్యూరిటీ గార్డుల తనిఖీలో పందెం కోడి దొరికిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణ ఉన్న కోడిని శుక్రవారం డిపో-2 మేనేజర్ మల్లయ్య ఆధ్వర్యంలో ప్రముఖ జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థ బ్లూక్రాస్(Blue Cross) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తూము నారాయణకు అప్పగించారు.
అయితే పందెం కోడిని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ జంతు సంరక్షణ సంస్థ సభ్యులు కొంత మంది వచ్చి వన్యప్రాణుల చట్టం ప్రకారం కోడిని వేలం వేయరాదని, జంతు సంరక్షణ కేంద్రాలను అప్పగించాలని ఆర్ఎం సుచరిత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉన్నతాధికారులతో చర్చల అనంతరం ఆమె ఆదేశాల మేరకు బ్లూ క్రాస్ సొసైటీ సంస్థకు కోడిని అప్పగించారు. అయితే అప్పటికే వేలం ప్రకటన చూసి పలువురు డిపో-2కు చేరుకున్నారు.
బ్రీడింగ్ కోసం పందెం కోడిని దక్కించుకునేందుకు రామకృష్ణ అనే వ్యక్తి మహదేవపూర్ నుంచి వచ్చాడు. రూ.25వేల వరకైనా వేలం పాడాలని నిర్ణంచుకొని వచ్చానని చెప్పాడు. అతనే కాకుండా నగరంలోని రెస్టారెంట్లు, హోటల్స్ యాజమానులు తరలివచ్చారు. చివరకు బ్లూక్రాస్ సంస్థకు అప్పగించడంతో నిరాశగా వెనుదిరిగారు. కాగా, కోడిని హైదరాబాద్ మాదాపూర్ బ్లూ క్రాస్ సంస్థ కేంద్రానికి తరలిస్తామని సంస్థ జిల్లా అధ్యక్షుడు నారాయణ తెలిపారు.
పందెం కోడిని వేలం వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, ఓ వ్యక్తి ఆ కోడి తనదేనని, వేలాన్ని ఆపాలని కోరిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తన పేరు వల్లపు మహేశ్ అని, తనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలి అని చెప్పాడు. అయితే ఉపాధి నిమిత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటానని చెప్పాడు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పందెం కోడిని తీసుకొని నెల్లూరుకు వెళ్తుండగా, బస్సులో మరిచిపోయానని, దయచేసి వేలం ఆపాలని, ఆ కోడి తనదేనని, ఆధారాలు ఉన్నాయంటూ కోరిన వీడియో వైరల్గా మారింది.