హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ మెడికల్ షాప్స్ తెరవబోతున్నది. ఆదాయ పెంపుమార్గాల్లో భాగంగా సంస్థ యాజమాన్యం ఈ వినూత్న నిర్ణయం తీసుకొన్నది. నిత్యం లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు బస్స్టేషన్లకు వస్తుంటారు. అలాంటి వారికి బస్స్టేషన్ల ఆవరణలోనే అవసరమైన మందులు లభించేలా సదుపాయాన్ని కల్పించడంతోపాటు ఆర్టీసీకి అదనంగా ఒక ఆదాయ మార్గం అవుతుందన్న ఆలోచనతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన బస్స్టేషన్ల ఆవరణలో వీటిని తెరిచేందుకు ప్రణాళికలు రూపొందించారు. తొలి విడతలో హైదరాబాద్ నగర పరిధిలోని 7 బస్స్టేషన్ల ఆవరణలో ప్రారంభించాలని నిర్ణయించారు. వీటిలో పైలట్ ప్రాజెక్టుగా తొలుత ఎంజీబీఎస్, కాచిగూడ బస్స్టేషన్లలో తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మెడికల్ షాప్లను తార్నాకలోని ఆర్టీసీ దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.