Cyber Crime | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : నగరంలో కొందరు కేటుగాళ్లు ఈజీగా డబ్బు సంపాదించాలని మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు అనే తేడా లేకుండా అందర్నీ టార్గెట్ చేస్తూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా నగరంలో మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, డబ్బులు ఇచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్లండి అంటూ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ తల్లిదండ్రులకు వాట్సాప్ కాల్ చేస్తున్నారు. అటువంటి కాల్స్కు స్పందించవద్దని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. సైబర్ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే అంటూ ట్వీట్ చేశారు. స్కూల్స్, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే చంపేస్తారంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు.
తాజాగా హైదరాబాద్ రాయదుర్గంలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు విదేశీ ఫోన్ నంబర్తో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. ‘నేను పోలీస్ ఆఫీసర్ను మాట్లాడుతున్నాను. కాలేజీకి వెళ్లిన మీ అమ్మాయి కిడ్నాప్నకు గురైంది. ఆమె ప్రస్తుతం మా దగ్గరే ఉంది, వెంటనే డబ్బును ఆన్లైన్ ద్వారా పంపించండి. లేకుంటే మీ అమ్మాయిని కిడ్నాపర్లు చంపేస్తారు’ అని బెదిరించారు’. ఇదిగో మీ అమ్మాయి ఏడుస్తుందంటూ ఒక వాయిస్ని వినిపించారు. ఏడుస్తున్న గొంతు వినిపించడంతో కాలేజీకి వెళ్లిన తమ కూతురు కిడ్నాప్నకు గురైందని తల్లిదండ్రులు భావించి, డబ్బులు పంపించేందుకు సిద్ధపడ్డారు. మోసగాళ్లతో ఫోన్లో మాట్లాడుతూనే తమ బంధువులకు ఈ విషయాన్ని చేరవేశారు. తమ కూతురు కాలేజీలో ఉందో..లేదో తెలుసుకోండని సూచించారు. ఆమె కాలేజీలో క్షేమంగా ఉందని చెప్పడంతో వెంటనే స్థానిక పోలీస్స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ తరహా బెదిరింపు ఫోన్ కాల్స్ తెలుగు రాష్ర్టాల్లో ఎక్కువగా వస్తున్నాయి. ఆడ పిల్లలను కిడ్నాప్ చేశారని చెప్పగానే నమ్మి డబ్బులు పంపిస్తున్నారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి విదేశీ ఫోన్ నంబర్లతో వచ్చే వాట్సాప్ కాల్స్కు స్పందించకండి. బెదిరింపులకు జంకకుండా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండని సజ్జనార్ సూచించారు.