హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళుతున్న టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో, బస్స్టేషన్ల ఆవరణలో ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన మంచినీటిని బాటిల్స్లో అందించాలని నిర్ణయించినట్టు ఎండీ వీసీ సజ్జనార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో తీసుకొచ్చే వాటర్ బాటిల్స్ డిజైన్తోపాటు వాటికి ఒక బ్రాండ్ పేరును సూచించాలని ప్రయాణికులను కోరారు. మంచి పేరు, డిజైన్ సూచించిన వాళ్లకు రివార్డులు కూడా ఇస్తామని వెల్లడించారు. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు నీళ్ల సీసాలు ఇస్తారు.
బయటి కంపెనీలు కాకుండా శుభ్రమైన ప్యాకేజ్డ్ తాగునీటిని తయారు చేసే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఆర్టీసీ బ్రాండింగ్తో వాటిని ఆర్టీసీ బస్సుల్లో, బస్స్టేషన్ల ఆవరణలోని దుకాణాల్లో విక్రయించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు బాటిల్ డిజైన్, పేరును 9440970000 నంబర్కు వాట్సాప్ చేయాలని లేదంటే @TSRTCHQ, #TSRTCompetition కు ట్విట్టర్ ద్వారా పంపాలని ఎండీ సజ్జనార్ కోరారు.