హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన తార్నాక దవాఖాన అత్యాధునిక హంగులతో సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నది. గతంలో నామమాత్రపు వైద్యసేవలకే పరిమితమైన ఈ దవాఖానను ప్రభుత్వం సకల వసతులతో బలోపేతం చేస్తున్నది. ప్రత్యేకించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సిబ్బంది వైద్యానికి భరోసా ఇచ్చేలా దవాఖానను తీర్చిదిద్దుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి అనేక సదుపాయాలు ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. కరోనా మొదటి వేవ్ తర్వాత దవాఖానలోని మొత్తం 200 బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా మార్చారు. 47 మంది రెగ్యులర్ వైద్యులతోపాటు సూపర్ స్పెషాలిటీ సేవల కోసం బయటి నుంచి డాక్టర్లను రప్పిస్తున్నారు. గతంలో ప్రైవేటు దవాఖానలకు రిఫర్ చేయడం వల్ల సంస్థ మీద ఏటా రూ.40 కోట్ల భారం పడేది. ఇప్పుడు ఆ డబ్బు మిగులుతుండడంతో శాశ్వత ఏర్పాట్లు చేసే వెసులుబాటు కలిగింది.
24 గంటలు ఎమర్జెన్సీ… ప్రత్యేకంగా డయాలసిస్ సెంటర్
ఆర్టీసీ తార్నాక దవాఖానకు ప్రతిరోజూ 1200 మంది వరకు ఔట్పేషెంట్లు వస్తున్నారు. అదేవిధంగా ఇన్పేషెంట్లుగా 65 నుంచి 70 మందికి సేవలందిస్తున్నట్టు సూపరింటెండెంట్ ఆర్ వెంకటరమణ తెలిపారు. ఎమర్జెన్సీ వైద్యసేవల కోసం ఐదు ఎమర్జెన్సీ బెడ్లను అందుబాటులోకి తెచ్చారు. దీనిలో 24 గంటలపాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా రూ.80 లక్షల వ్యయంతో 20 పడకల ఐసీయూను తొలిసారిగా అందుబాటులోకి తెచ్చారు. నాలుగుబెడ్లతో కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేసి రూ.15 లక్షల వ్యయంతో డయాలసిస్ మిషన్ తెప్పించారు. రూ.5 లక్షలతో ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేశారు. నిత్యం 200 మంది వరకు రోగులకు రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు. 2డీ-ఇకో, టీఎంటీ మిషన్లు గుండె పరీక్షల కోసం ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో రెండు అత్యాధునిక అంబులెన్స్లు సమకూరాయి. అదేవిధంగా రూ.1.2 కోట్లతో రౌండ్టేబుల్ ఇండియా సంస్థ ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయడంతో రోగులకు ఉపశమనంగా మారింది. రోగులు, వారి సహాయకులు, సిబ్బంది కోసం రూ.1.5 కోట్లతో క్యాంటీన్ను అందుబాటులోకి తెచ్చారు. రోగులకు అన్ని రకాల మందులను ఉచితంగా ఇస్తున్నారు.
త్వరలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్
ప్రస్తుతం తార్నాక దవాఖానలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అదేవిధంగా అతి త్వరలోనే ఎంఆర్ఐ, సీటీస్కాన్, క్యాథ్ల్యాబ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయినట్టు అధికారులు తెలిపారు. బయటికి రిఫర్ చేయాలంటే ఇప్పుడు కేవలం నిమ్స్కు మాత్రమే పంపిస్తున్నారు. అక్కడికి వెళ్లేవారికి సహాయంగా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ఇద్దరు లైజాన్ ఆఫీసర్లను నియమించారు. తార్నాక దవాఖాన ఆవరణలోనే ఈ ఏడాది నుంచి నర్సింగ్ కళాశాలను అందుబాటులోకి తెచ్చారు. దీనిలో ఆర్టీసీ సిబ్బంది పిల్లలకు ఐదు సీట్లను కేటాయించారు. త్వరలోనే వొకేషనల్ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు అధికారులు తెలిపారు.
బాగా పట్టించుకుంటున్నరు
నా పేరు జంగయ్య. మిథాని డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న. డ్యూటీకి వచ్చిన తర్వాత ఒళ్లంతా చెమటలు పట్టి బీపీ బాగా పెరిగింది. మావాళ్లు వెంటనే తార్నాక దవాఖానకు తీసుకొచ్చారు. ఇక్కడ ఎమర్జెన్సీలో పెట్టారు. ఇప్పుడు ఈసీజీ, మిగిలిన ఎక్స్రేలు చేయించిండ్రు. డాక్టర్లు బాగా పట్టించుకుంటున్నరు. చాలా సంతోషం..
– పి జంగయ్య, కండక్టర్, మిథాని డిపో
అన్ని మందులు ఇస్తున్నరు
నా కొడుకు ఆర్టీసీ డ్రైవర్గా చేస్తున్నడు. నాకు ఏ ఇబ్బంది అనిపించినా మనుమడిని వెంటపెట్టుకుని తార్నాక దవాఖానకే వస్త. ఛాతిలో నొప్పి వస్తుందని వచ్చిన. ఈసీజీ తీసిండ్రు. ఇంక ఏదో ఎక్సరే తీయాలన్నరు. ఒళ్లు నొప్పులు, బీపీకి ప్రతినెల మందులు ఇక్కడనే ఇస్తున్నరు. ఏ ఇబ్బంది లేదు..
– రాములమ్మ, మెహదీపట్నం డిపో డ్రైవర్ శ్రీను తల్లి