హైదరాబాద్: ఆర్టీసీ (TS RTC) కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం (RTC govt merger) బిల్లుకు గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) మోకాలడ్డడాన్ని నిరసిస్తూ కార్మికులు (RTC Employees) ధర్నాకు దిగారు. టీఎంయూ (TMU) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిపివేశారు. దీంతో ఉదయం 8 గంటల వరకు బస్సులు నిలిచిపోనున్నాయి. గవర్నర్ వైఖరిని నిరసిస్తూ డిపోల ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. గవర్నర్ ఒక రాజకీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నేడు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నారు.
కాగా, ఉదయం 11 గంటలవరకు కార్మికులందరూ హైదరాబాద్లోని నెక్లెస్రోడ్డుకు తరలిరావాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి పిలుపునిచ్చారు. 11 గంటలకు నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్భవన్ ముట్టడికి బయలుదేరుతామన్నారు. ఆర్టీసీ విలీన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతివ్వకపోవడం అన్యాయమని, కార్మికుల చిరకాల కోరికను తీరుస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవడం తగదన్నారు. బిల్లు ఆగిపోతే 43,373 మంది కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.