హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థ ‘సింగరేణి దర్శన్’ పేరిట ‘కోల్మైన్స్ టూరిజం ప్యాకేజీ’ని ప్రారంభించింది. ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్లోని జూబ్లీ, కరీంనగర్ బస్టాండ్ నుంచి ఈ టూర్ బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. అండర్గ్రౌండ్ బొగ్గు గనులు, ఓపెన్కాస్ట్ గనులు, గనుల రెస్క్యూ స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్ల వద్ద విద్యుత్తు తయారీని చూడవచ్చు. సందర్శకులకు స్నాక్స్, మధ్యాహ్న భోజనం ఇస్తారు. జేబీఎస్ నుంచి బయలుదేరే పర్యాటకులకు ఒక్కరికి రూ.2 వేలు, కరీంనగర్ బస్స్టాండ్ నుంచి ఒక వ్యక్తి రూ.వెయ్యి టూర్ ప్యాకేజీని నిర్ణయించింది. వివరాలకు 040-69440000, 040-23450033, www.tsrtconline లో సంప్రదించాలని సంస్థ కోరింది.
ఈ టూర్కు వచ్చే వారు 18 ఏండ్లు పైబడి, ఆరోగ్యవంతులైన వారినే సంస్థ అనుమతించనున్నది. మహిళలు కుర్తాలు, జీన్స్, పైజామ వంటి వస్ర్తాలనే దర్శించాలని, షూ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించింది. సంస్థ ఇచ్చే హెడ్లైట్ హెల్మెట్ పెట్టుకోవాలి. సూచనలు, సలహాలను పాటించాలి. సందర్శకులు వ్యక్తిగతంగా బాండ్పై సంతకం చేయాల్సి ఉంటుంది. గనుల్లోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా ఆధార్కార్డ్ జిరాక్స్ ఇవ్వాలని ఆర్టీసీ తెలిపింది.