హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు ఎక్కారంటే ఎవరైనా సరే టికెట్ తీసుకోవాల్సిందే. నాలుగేళ్లు దాటిన పిల్లలందరికి సైతం టికెట్ కొట్టాల్సిందే. పలుచోట్ల బస్సు ఎక్కిన తర్వాత టికెట్ విషయంలో చాలాసార్లు వాదనలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో.. వయసు ఎక్కువగా ఉంటుందని.. లేదు తక్కువగానే ఉందంటూ.. ఇలా ప్రయాణికులు, కండక్టర్లకు జరిగే వాదనలు తారాస్థాయికి చేరిన సందర్భాలూ లేకపోలేదు. అలాగే లగేజీకి సైతం ఈ నిబంధన వర్తిస్తుంది.
ఇప్పుడిదంతా ఎందుకంటే ఓ ఆర్టీసీ బస్ కండక్టర్ కోడికి టికెట్ కొట్టగా.. ఇది చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్ గోదావరిఖని నుంచి కరీంనగర్ వెళ్తోంది. మహమ్మద్ అలీ అనే ప్రయాణికుడు బస్సు ఎక్కాడు. కరీంనగర్ వెళ్లేందుకు టికెట్ తీసుకున్నాడు. అతని వెంట ఓ కోడిపుంజును తీసుకెళ్లారు. బస్ సుల్తానాబాద్ వద్దకు చేరగా.. బస్ కండక్టర్ తిరుపతికి కోడి శబ్దం వినిపించింది. దీంతో కోడికి సైతం టికెట్ తీసుకోవాలని చెప్పి.. రూ.30 టికెట్ తీసి ప్రయాణికుడి చేతికి అందజేశాడు.
ఆ టికెట్ చూసిన అలీ షాక్కు గురయ్యాడు. కోడికి టికెట్ ఏంటి? అని ప్రశ్నించగా.. ప్రాణంతో ఉండే ప్రతి జీవికి టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పడం ప్రయాణికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి వెళ్లగా.. స్పందించిన ఆయన.. ఘటనపై దృష్టి సారిస్తామన్నారు.