RS Praveen Kumar | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి వార్నింగు లు బంద్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హితవు పలికారు. ‘పాలమూరు బి డ్డనని చెప్పుకుంటున్న సీఎం రేవంత్రెడ్డీ.. నేను కూడా పాలమూరు బిడ్డనే. ఒక వైపు నన్ను సుతిమెత్తగా పొగుడుతూనే, మరోవైపు సుతిమెత్తగా వార్నింగులు ఇస్తున్నా రు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తానని సీఎం ఇచ్చిన ఆఫర్ వాస్తవమే. నేను తిరస్కరించిందీ వాస్తవమే. నేను ప్రజాక్షేత్రంలో ఉం డాలనుకున్నా. బీఆర్ఎస్ వైపు వెళ్తే ప్రజలకు సమాధానం చెప్పాలని మీరు బెదిరింపులకు దిగుతున్నారు. నేను వాటికి భయపడేది లేదు’ అని సీఎం వ్యాఖ్యలకు ఆర్ఎస్పీ దీటుగా బదులిచ్చారు. ఏ పార్టీలోకి వెళ్లాలో, వెళ్లకూడదో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా? అంటే వార్నింగ్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎక్కడ గేట్లు ఓపెన్ చేస్తే.. అక్కడికే వెళ్లాలా? అని సీఎంను నిలదీశారు. సోమవారం ఆయన గజ్వేల్కు భారీ ర్యాలీగా బయలుదేరే ముందు తెలంగాణభవన్లో, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్న అనంతరం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో మాట్లాడారు. ‘నేను ఇప్పటికీ.. ఎప్పటికీ అణగారిన వర్గాల గొంతుకగా ఉండాలని బీఆర్ఎస్లోకి వచ్చా. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజల ప్రాణాలు, తాగునీరు, సాగు నీళ్లు, విద్యార్థుల స్కాలర్షిప్లు, సంక్షేమ పథకాలకు గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నది. మీడియా లో ప్రచార ఆర్భాటం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు. పేదలు, రైతులు, ప్రజల ప్రక్షా న ప్రశ్నించే గొంతుకగా ఉండాలనే బీఆర్ఎస్లో చేరుతున్నా’ అని అన్నారు. తన భావజాలానికి దగ్గరగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ అని.. అందుకే ఈ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. సీఎంగా రేవంత్రెడ్డి పాలన వదిలేసి, ప్రచారం చేసుకొనేందుకు ప్రపంచానికి వైబ్రంట్గా ఉంటున్నారని విమర్శించారు. నిజంగా ప్రజలకు సేవ చేయటం లేదని ఆరోపించారు. ప్రాణహిత-గోదావరి, తుంగభద్ర-కృష్ణ నదులుగా తెలంగాణవాదం, బహుజనవాదం రెం డూ ఒక్కటేనని అన్నారు. ఒకప్పుడు తెలంగాణవాదం, బహుజనవాదం అణచివేతకు గురయ్యాయని, పోరాటాల ద్వా రా, ఉద్యమకారులను కలుపుకొని కేసీఆర్ విముక్తి కల్పించారని కొనియాడారు.
పదేండ్లు స్వర్ణయుగం
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పదేండ్లపాటు స్వర్ణయుగాన్ని చూసిందని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చెప్పారు. తెలంగాణకు బలమైన, గొప్ప పునాది వేశారని వెల్లడించారు. అందుకే అధికారం లేకపోయినా ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని వెల్లడించారు. చాలామంది నేతలు బీఆర్ఎస్ను వీడిపోతున్న తరుణంలో పెద్ద బలగంలా వచ్చిన తనను అక్కున చేర్చుకున్న బీఆర్ఎస్ నేతలకు కృతజ్ఞతలు అని తెలిపారు. ఒక బలమైన తెలంగాణను నిర్మించే యజ్ఞంలో భాగస్వాములు కావాలనుకుని బీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పారు. పొత్తు రద్దు చేసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒత్తిడి తెచ్చారని, స్నేహబంధానికి విలువ ఇచ్చి ఆ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. కేసీఆర్ మాదిరి ప్రవీణ్కుమార్ కూడా మడమ తిప్పరని, మాట ఇ స్తే కట్టుబడి ఉండాలనే బీఆర్ఎస్లో చేరుతున్నానని వెల్లడించారు. తనతోపాటు వచ్చిన బహుజనులకు, అవకాశం ఇచ్చిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తన గుండెల్లో బహుజనవాదం, మహనీయులు, అమరుల త్యా గాలు, వారు చూపించిన సారాంశం ఎప్పటికీ ఉంటాయని గుర్తుచేశారు. తనలో ఎలాంటి స్వార్థం లేదని, బహుజనులంతా తనను అర్థం చేసుకోవాలని కోరారు.
వాళ్లంతా పిరికిపందలు, స్వార్థపరులే
ముఖ్యమంత్రి గేట్లు తెరిస్తే పోయినోళ్లంతా పిరికిపందలని ప్రవీణ్కుమార్ విమర్శించారు. అక్రమంగా ఆస్తులు సంపాదించినోళ్లు వాటిని కాపాడుకోవడానికి అక్కడికి వెళ్లారని ఆరోపించారు. ‘మీరు గేట్లు ఎత్తితే చాలామంది పిరికిపందలు, అసమర్థులు, స్వార్థపరులు ఆ గేట్ల నుంచి గొర్లమందల్లా వస్తున్నారు. ఆ గొర్రెల మందలో ప్రవీణ్కుమార్ ఒకడు కాలేడు. కాడు కూడా. నిజాయతీతో, నిస్వార్థంగా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే నాయకుడిని. ఆ గొర్లమందలో కలవలేదన్న అక్కసుతో ఆ మాటలు అంటున్నవా సీఎం?’ అని ప్రశ్నించారు.
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామిని అవుతా
‘చాలామంది కేసీఆర్ దగ్గర ఎంత ప్యాకేజీ తీసుకున్నావని అడుగుతున్నారు. నేను ప్యాకేజీ తీసుకునేవాడిని అయితే, అధికార పార్టీ గేట్ల దగ్గర కూర్చొనేవాడిని కదా. నేను ప్యాకేజీల కోసం వచ్చినవాడిని కాదు. ప్రశ్నించడానికి వచ్చినవాడిని. దొంగ ఆస్తులను రక్షించుకుందామని వచ్చినవాడిని కాదు. భయంతో వేరే పార్టీలో చేరేవాడిని అంతకంటే కాదు. పోలీసు ఉద్యోగాన్ని పక్కనపెట్టి.. కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పదేండ్ల పాటు, పది లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా మార్చాను. ఇప్పటికైనా రేవంత్రెడ్డి బెదిరించటం బంద్ చేయాలె. ఎందుకంటే నేను కూడా పాలమూరు బిడ్డనే. తుంగభద్ర నీళ్లు తాగినోడినే. నడిగడ్డ గాలి పీల్చిన. నడిగడ్డ తిండే తిన్నా. హోదాను తగ్గించుకోవద్దు’ అని ఆర్ఎస్పీ హితవు పలికారు. కార్యక్రమంలో చురుగ్గా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే బాల సుమన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ వినోద్కుమార్, మాజీ మంత్రి పొన్నాల లక్షయ్య, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దేవీప్రసాద్, గెల్లు శ్రీనివాస్యాదవ్, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.