BRS-BSP Alliance | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు రద్దు చేసుకోవాలని బీఎస్పీ నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా, రాష్ట్రంలో బహుజనుల ప్రయోజనాల కోసం, దేశంలో రాజ్యాంగ రక్షణ కోసం, లౌకికవాదాన్ని బతికించటం కోసమే తాను బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. బీజేపీ కుట్రలు, పన్నాగాలకు తలొగ్గి బహుజనులకు అన్యాయం చేయలేనని వెల్లడించారు. తెలంగాణ వాదం, బహుజన వాదం ఒకటేనని స్పష్టం చేశారు. శనివారం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకొని కేసీఆర్తో చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పొత్తు, అనంతర పరిణామాలను చర్చించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా తాను బీఎస్పీకి రాజీనామా చేసినట్టు కేసీఆర్కు తెలిపారు. భేటీ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ మాయావతి ఆశీర్వాదంతో 2021 ఆగస్టులో బీఎస్పీలో చేరానని అన్నారు.
4 వేల గ్రామాలు, 350 రోజులు లక్షల మందితో వందల సభలు పెట్టి బహుజనవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా తాను, 107 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని తెలిపారు. తాము అనుకున్న విధంగా ఎన్నికల్లో ఫలితాలు రాలేదని వెల్లడించారు. పార్టీ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు, ఎన్డీయే, ఇండియా కూటమితో కాకుండా ప్రాంతీయంగా పొత్తు పెట్టుకోవాలన్న మాయావతి సూచనలకు అనుగుణంగా బీఆర్ఎస్తో లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నామని వివరించారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల క్యాడర్తో చర్చించి పొత్తు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పార్టీ కేంద్ర నాయకులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించామని అన్నారు. బీజేపీని నిలువరించేందుకే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నామని, కేసీఆర్తో చర్చల అనంతరం రెండు సీట్లు బీఎస్పీకి కేటాయించారని వివరించారు. నాగర్కర్నూల్, హైదరాబాద్ సీట్లను బీఆర్ఎస్ కేటాయించిందని, ఈ సమాచారాన్ని అందరికీ తెలిపామని అన్నారు. కానీ, తమ పొత్తు నచ్చని ప్రధాని మోదీ, అమిత్షా ద్వయం.. బీఎస్పీపై ఒత్తిడి తెచ్చారు. పొత్తు రద్దు చేసుకోవటం తనకు ఇష్టంలేదని స్పష్టం చేశారు.
తాను మాయవతి, కాన్షీరాం లాంటి అనేకమంది స్ఫూర్తి పొందానని, ఒక్కసారి మాట ఇస్తే తప్పేది ఉండదని తేల్చిచెప్పారు. పొత్తు ధర్మం ప్రకారం ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కలిసి నడవాల్సి ఉంటుందని అన్నారు. పొత్తు రద్దు చేసుకోవాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తాను బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తనకు అవకాశం కల్పించిన మయావతికి పాదాభివందనాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. బహుజనవాదం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. త్వరలోనే శ్రేయోభిలాషులు, అభిమానులు, తనతో పాటుగా నడవాలని అనుకున్నవారితో సమావేశమై రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. కేసీఆర్తో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఎక్స్ వేదికగానూ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పందించారు. ‘భారమైన హృదయంతో బీఎస్పీని వీడుతున్నా. తప్పనిసరి పరిస్థితుల్లో, విధిలేక ఈ నిర్ణయాన్ని తీసుకున్నా. బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నది. ఎన్నికల షెడ్యూల్కు కొన్ని గంటల ముంటు కవిత అరెస్టు ఇందులో భాగమే. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. ఈ ప్రస్థానాన్ని ఆపను. స్వేరోస్ అందరూ ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
బీజేపీని నిలువరించేందుకే బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు పెట్టుకొన్నది. కానీ, మా పొత్తు నచ్చని ప్రధాని మోదీ, అమిత్షా ద్వయం.. బీఎస్పీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చింది. పొత్తు ధర్మం ప్రకారం ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కలిసి నడవాల్సి ఉంటుంది. పొత్తు రద్దు చేసుకోవాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నేను బీఎస్పీకి రాజీనామా చేస్తున్నాను.
– ఆర్ఎస్ ప్రవీణ్కుమార్