జనగాం : తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడానికి చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మన ఊరు-మన బడి పథకం కింద పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపడి ప్రైవేట్స్కూ్ళ్లకంటే మెరుగ్గా పనిచేస్తాయని వెల్లడించారు. గురువారం జిల్లాలోని కొండూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సరస్వతి మాత విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.
అనంతరం గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నదన్నారు. రూ. 7వేల కోట్లతో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని చేపట్టి, 3 విడతలుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూ్ళ్లను ఆధునీకరణ చేస్తున్నామని వెల్లడించారు.పిల్లలకు న్యూట్రీషియన్ కిట్స్,విదేశీ చదువుల కోసం ఉపకార వేతనాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ లోనే చదివించాలని కోరారు.
ప్రభుత్వ వైద్యానికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటు అవుతున్నాయని మంత్రి వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం పై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అద్భుత పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి ని ప్రజలు విశ్లేషించుకుని, ప్రజలకు మంచి చేసే వారిని ఆదరించి అండగా నిలవాలని కోరారు .