కరీంనగర్ : దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకంతో దళితులు అభివృద్ధి చెందుతారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం వద్ద తెలంగాణ దళితబంధు ఆస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిన్న డ్రైవర్లుగా, క్లీనర్లుగా పనిచేసిన వారు నేడు దళితబంధు పథకం ద్వారా యజమానులుగా మారడం అభినందనీయమని అన్నారు.
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి కుటుంబానికి రూ.లు 10 లక్షలు అందజేసిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలకు ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందని అన్నారు. 24 మంది లబ్ధిదారులకు 10 యూనిట్లుగా, 6 హార్వెస్టర్లు, 3 జేసీబీలు, డీసీఎం వ్యాన్ మంత్రి పంపిణీ చేశారు.
ఒక్కో హార్వెస్టర్ రూ. 22 లక్షలు, ఒక్కో జేసీబీ రూ. 34 లక్షలు, డీసీఎం వ్యాన్ రూ.ల 24 లక్షలు కాగా మొత్తంగా 2 కోట్ల 60 లక్షల విలువ చేసే వాహనాలను లబ్ధిదారులకు అందించామని మంత్రి తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి హార్వేస్టర్లు నడిపి ఆకట్టుకున్నారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాల కిషన్, సుంకె రవి శంకర్, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీ.వి. రామకృష్ణా రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, ఎస్సీ కార్పోరేషన్ ఈ.డి. సురేష్, క్లస్టర్ అధికారులు, కార్పోరేటర్లు పాల్గొన్నారు.