మహబూబ్నగర్ అర్బన్, జూలై 21 : రైల్వే అండర్పాస్ బ్రిడ్జి లేకపోవడంతో మహబూబ్నగర్ పట్టణంలోని న్యూమోతీనగర్, సద్దులగుండు ప్రాంతానికి చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని మంగళవారం సౌత్ సెంట్ర ల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజీయ్ కుమార్ శ్రీవాస్తవను మాజీ మంత్రి కలిసి వినతిప త్రం అందజేశారు. న్యూ మోతీనగర్లో 10 వేల మందికిపైగా ప్రజలు నివసిస్తున్నారని, అక్కడ నుంచి సద్దులగుండు, రాజేంద్రనగర్, ప్రేమ్నగర్ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ఇప్పటికీ రైల్వే ట్రాక్ను దాటాల్సిన పరిస్థితి ఉందన్నారు.
ఈ కారణంగా అనేక మంది ప్రజలు ప్రమాదాలకు గురై అవయవాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని వివరించారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా అత్యవసరంగా రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యూ బీ) నిర్మించాలని కోరారు. అదే విధంగా న్యూ మోతీనగర్ నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్సీ) గోదాం వరకు శాశ్వత రహదారి నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతులు ఇవ్వాలని కోరారు. రైల్వే అనుమతి లభించిన వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కానీ లేద సొంత ఖర్చుతో గానీ రహదారిని ఏర్పాటు చేసుకుంటామన్నారు.
అలాగే న్యూ మోతీనగర్ బ్రిడ్జి వద్ద మురుగునీరు నిత్వం నిలిచి ఉండడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, వెంటనే నీటి నిల్వ సమస్యను శాశ్వతంగా తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వినతిపై సానుకూలంగా స్పందించిన రైల్వే జీఎం సంజయ్ కుమార్ సమస్యను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజినీయర్, డిప్యూటీ జనరల్ మేనేజర్లను ఆదేశించారు. మాజీ మంత్రి వెంట కార్పొరేటర్లు మధుమోహన్, లక్ష్మీనరేశ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, నాయకులు రాములు, శేఖర్, గోఫి, రవికుమార్, సిద్దూ పాల్గొన్నారు.