నిర్మల్ జనవరి 31 : దేశంలోనే 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని సారంగాపూర్ మండల కేంద్రంలో రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పట్టణాలు, గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సబ్ స్టేషన్ ల నిర్మాణాలకు నిధులను కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం నాణ్యమైన కరెంట్ సరఫరా లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నెలకొల్పినట్లు తెలిపారు.
గతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచి పోవడం, లోవోల్టేజీ సమస్యలతో వినియోగదారులు నానా అవస్థలు పడ్డారని, ఇప్పుడు ఎలాంటి అంతరాయాలు లేకుండా నిర్విరామంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఈ ఉప కేంద్రం ఏర్పాటుతో లో ఓల్టేజీ, బ్రేక్ డౌన్ సమస్యు తీరిపోనున్నాయని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో 50 కి పైగా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, సారంగపూర్ మండలంలోనే 9 సబ్ స్టేషన్లు నిర్మించుకున్నామని మంత్రి తెలిపారు.