కేసీఆర్ ప్రభుత్వానిది మచ్చలేని పాలన
మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్సే
బండి కేంద్రంపై ఆర్టీఐని ప్రయోగించాలి
బడుగుల లింగయ్యయాదవ్ విమర్శ
హైదరాబాద్, జూలై 06 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ది మచ్చలేని పాలన అయితే, ప్రధాని మోదీది మూర్ఖపు పాలన అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రజలకు నిరాశే మిగిల్చాయని చెప్పారు. బుధవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక టీఆర్ఎస్పై, సీఎం కేసీఆర్పై బీజేపీ నేతలు నడ్డా, పీయూష్గోయల్, బండి సంజయ్ అసత్యాలు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. తెలంగాణపై మోదీ మరింత కక్షపూరితంగా వ్యవహరిస్తామని చెప్పకనే చెప్పారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక తోకముడిచిన మూర్ఖపు ప్రధాని మోదీ అని ఎద్దేవా చేశారు. విభజన చట్టం హామీలపై టీఆర్ఎస్ ఎంపీలు పోరాడుతుంటే, రాష్ర్టానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు నోరుమెదపడం లేదని అన్నారు. కేసీఆర్ దార్శనిక పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అనేక రాష్ర్టాలు తెలంగాణ పథకాలను అనుసరిస్తున్నాయని వివరించారు. బీజేపీ రాష్ర్టాల్లో ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, దళితబంధు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేయాలని సవాల్ చేశారు.
దమ్ముంటే కేంద్రంపై ఆర్టీఐ ప్రయోగించాలి
బండి సంజయ్కు దమ్ముంటే రాష్ర్టానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో రాబట్టేందుకు ఆర్టీఐ చట్టాన్ని ప్రయోగించాలని లింగయ్యయాదవ్ సవాల్ చేశారు. కేసీఆర్ ఏం చేసినా బాజాప్తాగా చేశారని, ఎంతమంది సంజయ్లు ఎన్ని పత్రాలు, ఏ వివరాలు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని స్పష్టంచేశారు. రాష్ర్టానికి న్యాయంగా రావాల్సినవి తెచ్చే తెలివి బండికి లేదని దుయ్యబట్టారు. మచ్చలేని కేసీఆర్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చూస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. కేంద్రం మంత్రి పీయూష్ గోయల్ బహిరంగ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించి, అంతర్గత సమావేశాల్లో తెలంగాణ స్టార్టప్లు దేశానికే ఆదర్శమని పేర్కొనటం ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శమని చెప్పారు. అబద్ధాల బండి సంజయ్, అవినీతి రేవంత్రెడ్డి ఎన్ని వేషాలు వేసినా రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్సేనని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ రెండోస్థానం కోసం పోటీపడతాయన్నారు.