హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ, టోల్ వసూళ్ల ఒప్పందంలో భాగంగా హెచ్ఎండీఏ నుంచి ప్రభుత్వానికి రాయితీ సొమ్ము రూ.6,500 కోట్ల మళ్లింపు వ్యవహారం తమ తీర్పుకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ప్రాథమిక అంచనా రాయితీ విలువను ప్రకటించకుండా ఓఆర్ఆర్ నిర్వహణ, టోల్ వసూళ్లకు హెచ్ఎండీఏ మే 28న గోలొండ ఎక్స్ప్రెస్వే సంస్థతో 30 ఏండ్లకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే.
రూ.7,380 కోట్లకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అన్యాయమంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం బుధవారం మ రోసారి విచారణ చేపట్టింది. హెచ్ఎండీఏ నుంచి మళ్లించిన నిధులను ప్రభుత్వం ఖర్చు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ప్రతివాదన చేస్తూ.. హెచ్ఎండీఏ వేరే గ్రహానికి చెందిన సంస్థ కాదని, అది ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్నదని తెలిపారు. ఓఆర్ఆర్ టో ల్ రెవెన్యూ మొత్తం ప్రభుత్వానికే చెందుతుందని, టోల్ వసూలు చేసే బాధ్యత మాత్రమే హెచ్ఎండీఏదని వివరించారు. పిటిషనర్ తనకు అనుకూలమైన విషయాలను మాత్రమే చెప్తున్నారని, పలు విషయాలను దాచిపెడుతున్నారని పేర్కొన్నా రు. దీనిపై సమగ్ర వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని కోరారు. దీంతో అక్టోబర్ 10న పూర్తిస్థాయి వాదనలు వింటామని హైకోర్టు ప్రకటించింది.