హైదరాబాద్ : తెలుగు అకాడమీలో గల్లంతైన రూ.64.5 కోట్లను బ్యాంకులే చెల్లించాలని అకాడమీ అధికారులు బ్యాంక్లకు అల్టిమేటం జారీచేశారు. రిజర్వ్బ్యాంక్ నిబంధనల ప్రకారం ఆయా మొత్తాన్ని బ్యాంకులే తమకు చెల్లించాలని తేల్చి చెప్పింది. ఎఫ్డీల గల్లంతుకు బ్యాంక్లే బాధ్యత వహించాలని, ఏదేమైనా తమ డబ్బులను తమకు ఇచ్చేయాల్సిందేనని బ్యాంక్లకు ఆదేశాలిచ్చారు.
అధికారుల హెచ్చరికలతో అప్రమత్తమయిన బ్యాంక్ అధికారులు ఆయా మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు అంగీకరించారు. బ్యాంక్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. మొత్తంగా ఈ నెలాఖరులోగా మొత్తం రూ.64.5 కోట్లను తెలుగు అకాడమీ ఖాతాలకు బదలాయించనున్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా అకాడమీకి చెందిన నిధులను ఎఫ్డీలు మార్చకుండా తెలుగు అకాడమీ బైలాస్ను మార్చేందుకు సైతం అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తెలుగు అకాడమీలో 64.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు గల్లంతైన విషయం తెలిసిందే. కార్వాన్, సంతోష్నగర్లలోని యూనియన్ బ్యాంక్లు, చందానగర్లోని కెనరా బ్యాంక్ బ్రాంచీల నుంచి ఇవి పక్కదారి పట్టాయి. ఈ నేపథ్యంలో ఆయా మొత్తాన్ని రికవరీ చేయాలని నిర్ణయించిన అధికారులు ఆర్థికశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. అధికారుల ప్రమేయం లేకుండా బ్యాంక్ల నుంచి ఎఫ్డీలు గల్లంతుకావడంతో ఇందుకు బ్యాంక్లే బాధ్యత వహించాలని, రిజర్వ్బ్యాంక్ నిబంధనలు సైతం ఇదే చెబుతున్నాయని అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఇటీవలే యూనియన్ బ్యాంక్, కెనరాబ్యాంక్ల తెలంగాణ సీజీఎంలతో తెలుగు అకాడమీ అధికారులు ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. నిధుల గల్లంతుకు బ్యాంక్లే బాధ్యత వహించాలని, ఆయా మొత్తాన్ని బ్యాంకులే తమకు చెల్లించాల్సిందేనని సీజీఎంల సమావేశంలో అధికారులు తేల్చిచెప్పారు. ఇందుకు బ్యాంక్ అధికారులు ఒప్పుకోవడంతో ఈ కథ సుఖాంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్థికశాఖ నిర్వహించే స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ ) సమావేశం ఎజెండాలో సైతం రికవరీ ఈ అంశాన్ని చేర్చారు.
తాజా కుంభకోణం నేపథ్యంలో తెలుగు అకాడమీకి చెందిన ఎఫ్డీలన్నింటిని అధికారులు ఉపసంహరించారు. అకాడమీకి చెందిన రూ. 320 కోట్లను గతంలోనే ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చారు. 12 జాతీయ బ్యాంక్లు సహా మొత్తం 31 బ్యాంకుల్లో ఇవి ఉన్నాయి. వీటిలో నుంచి మూడు బ్యాంకుల్లో రూ.64.5 కోట్లు గోల్మాల్ కాగా, మిగతా రూ. 255.5 కోట్ల ఎఫ్డీలు భద్రంగా ఉండగా, వాటిని ఉపసంహరించి తెలుగు అకాడమీకి చెందిన ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాకు బదలాయించారు. అంతేకాకుండా అకాడమీకి చెందిన నిధుల జమ, ఖర్చులపై సమగ్రంగా ఆడిటింగ్ను జరిపించనున్నారు. ట్రెజరీ అండ్ అకౌంట్స్ విభాగం ద్వారా ఆడిటింగ్ను నిర్వహించనుండగా, ఇందుకోసం ఇద్దరు అధికారులను కేటాయించాలని కోరుతూ ఆశాఖకు లేఖ రాశారు.