గజ్వేల్: గజ్వేల్ పట్టణంలో (Gajwel) అక్రమంగా తరలిస్తున్న నగదు భారీగా పట్టుబడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గజ్వేల్లోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బచ్చు రత్నాకర్ అనే వ్యక్తి ఓ కారులో (టీఎస్36సీ 0198) రూ.50 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా రూ.50 వేలకు మించి నగదును ప్రజలు తమవెంట తీసుకెళ్లకూడదని గజ్వేల్ సీపీ అనురాధ సూచించారు. ఎక్కువగా తీసుకెళ్లినట్లయితే దానికి సంబంధించి సరైన పత్రాలు వెంబడి ఉంచుకోవాలన్నారు. లేనట్లయితే ఆ మొత్తాన్ని సీజ్ చేస్తామని తెలిపారు. డబ్బులను ఐటీ డిపార్ట్మెంట్కు అప్పగిస్తామని, బాధితులు సరైన ధ్రువపత్రాలు చూపించి వాటిని రిలీజ్ చేసుకోవచ్చని తెలిపారు.