సుల్తాన్బజార్, జూన్ 1: ‘మన బస్తీ – మనబడి’ కార్యక్రమానికి టాటా సంస్థ చేయూతనిచ్చింది. శిథిలావస్థలో ఉన్న హైదరాబాద్లోని సుల్తాన్బజార్ క్లాక్ టవర్ ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని రూ.4 కోట్లతో నిర్మించేందుకు సంకల్పించింది. బుధవారం సుల్తాన్బజార్లోని క్లాక్ టవర్ ప్రభుత్వ పాఠశాలను టాటా సంస్థ ప్రతినిధులతో కలిసి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ఈ పాఠశాల స్థానంలో విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, వసతులతో కూడిన నూతన భవనాన్ని రూ.4 కోట్లతో నిర్మించేందుకు టాటా సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు మన బస్తీ- మన బడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. అనంతరం టాటా సంస్థ ప్రతినిధి కృష్ణారెడ్డి నూతన భవన నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రికి వివరించారు.