హైదరాబాద్ : సూర్యాపేట్-అశ్వారావుపేట మార్గంలో ఖమ్మం పట్టణంలోని మున్నేరు వాగుపై ట్రాఫిక్ సమస్యలకు త్వరలోనే చెక్ పడనున్నది. ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే సాకారం కానున్నది. ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ సందర్భంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి.. కేవలం ఒక రోజులోనే ఇందుకు సంబందించిన నిధులను విడుదల చేశారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ మున్నేరుపై అత్యాధునిక పద్ధతుల్లో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 420 మీటర్ల పొడవున నిర్మించనున్న ఈ కేబుల్ వంతెన 300 మీటర్లు కేబుల్పై నిలువనుండగా, మిగిలిన 120 మీటర్లు ఆర్సీసీతో నిర్మించనున్నారు.
సూర్యాపేట్-అశ్వారావుపేట మార్గంలో ఖమ్మం పట్టణంలోని నయాబజార్ వద్ద మున్నేరు వాగుపై అనేక దశాబ్దాల క్రితం నిర్మించిన అతి తక్కువ వెలడ్పుగల వంతెనే రాకపోకలకు ఆధారంగా ఉంది. వరంగల్ వైపునుంచి ఖమ్మం పట్టణానికి వచ్చే వాహనాలు కూడా ఈ వంతెనగుండానే ప్రయాణించాల్సి వస్తున్నది. కేవలం 20 అడుగుల వెడెల్పు ఈ వంతెన ప్రస్తుత ట్రాఫిక్కు ఏమాత్రం సరిపోవడంలేదు. ఖమ్మం పట్టణం భారీగా విస్తరణకు గురికావడమే కాకుండా సూర్యాపేట్-అశ్వరావుపేట మార్గంలో వాహనాల రద్దీ పెరగడంతో ఈ వంతెనపై నిత్యం ట్రాఫిక్ జామ్లు సంభవిస్తున్నాయి.
తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అంతే కాకుండా వంతెన ఎంతో పూరాతనమైనది కావడంతో వర్షాకాలంలో వరద తాకిడికి ప్రమాదం జరుగుతుందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన అవసరాలకు అనుగుణంగా నూతన వంతెనను నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇటీవల మున్నేరు వాగుపై వంతెన నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తిచేశారు. ఖమ్మం బహిరంగ సభ సందర్భంగా సీఎం కేసీఆర్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
సీఎం హామీ మేరకు గురువారం మున్నేరు వాగుపై అత్యాధునిక కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 180 కోట్లు మంజూరు చేస్తూ ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్లోని దుర్గం చెరువుపై నిర్మించిన తరహాలోనే ఖమ్మం మున్నేరు వాగుపై రూ.180 కోట్ల వ్యయంతో కేబుల్ వంతెన నిర్మించనున్నారు. దీంతో సూర్యాపేట్, వరంగల్ మార్గాలనుంచి ఖమ్మం వచ్చే ట్రాఫిక్తోపాటు ఖమ్మం పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులనుంచి ఎంతో ఉపశమనం లభించనున్నది. త్వరలోనే వంతెన నిర్మాణానికి అవసరమైన డిజైన్లు రూపొందించి టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.