హైదరాబాద్: 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో మూసీ అభివృద్ధికి (Moosi Development) రూ.1000 కోట్లు ప్రతిపాదించారు. హైదరాబాద్ మెడలో అందమైన హారంలా మూసీ నదిని తీర్చిదిద్దుతామని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంటు ప్రాజెక్టులో భాగంగా పాదచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, ఓల్డ్ సిటీలోని హెరిటేజ్ జోన్లు, హాకర్స్ జోన్లు, చిల్డ్రన్స్ థీమ్స్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తామన్నారు.
మూసీ నదిని, నదీ తీరాన్ని ఒక పర్యావరణహిత పద్ధతిలో సమగ్ర ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కూడా ఇందులో భాగంగా అమలు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు చార్మినార్ హైటెక్సిటీ, సాలార్జంగ్ మ్యూజియం వంటి పర్యాటక స్థలాలతో పోటీపడుతుందనడంతో ఎలాంటి సందేహం లేదన్నారు.