హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు పాలమూరు అంటే.. వలస కూలీలు అని ఠక్కునే గుర్తొచ్చే ప్రాంతం. అలాంటి ప్రాంతంలోని వనపర్తికి చెందిన మహ్మద్ మన్సూర్ అహ్మద్ తన చిన్నతనంలోనే.. ఉపాధి కోసం ముంబైకి వెళ్లే ఎంతో మంది కూలీలను, వారి జీవితాలను చాలా దగ్గరగా చూశాడు. కాలక్రమం లో ఇంజినీరింగ్ చదివి, గల్ఫ్లో ఉన్నత స్థాయి ఉద్యోగం పొందిన మన్సూర్ అహ్మద్.. రూ. లక్షల్లో వేతనం లభిస్తున్నా సంతృప్తి చెందలేదు. వలస కూలీల కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనతో గల్ఫ్ నుంచి వచ్చేసి, 8 నెలల క్రితం హైదరాబాద్లో ‘రోజ్గార్ కార్ట్’ స్టార్టప్ ప్రారంభించారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కూలీలకు నేరు గా పనులు కల్పించడం, వారి జీతాల్లో ఎ లాంటి కోతలు లేకుండా చూడటమే లక్ష్యం గా సహ వ్యవస్థాపకులు తుఫైల్ అహ్మ ద్, సునీల్కుమార్తో కలిసి దీన్ని ఏర్పాటు చేశా రు. ఇందుకోసం హైదరాబాద్లో రోజువారీ కూలీలు ఉండే అడ్డాలకే వెళ్లి వారి డాటా సేకరించారు. నైపుణ్యం ఆధారంగా వారిని ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, తాపీ మేస్త్రీలు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, వంట మనుషులు తదితర క్యాటగిరీలుగా విభజించారు. ఈ-కేవైసీ, వీడియో కాలింగ్ ఇంటర్వ్యూల ద్వారా వారిని పనుల్లోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. నైపుణ్యం లేనివారికి తగిన శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇలా రోజువారీ కూలీలకు ఇతోధిక సేవలు అందిస్తున్న ‘రోజ్గార్ కార్ట్’.. టీహబ్ ఆధ్వర్యంలోని ల్యాబ్-32, రూబ్రిక్స్ కార్యక్రమాలకు ఎంపికైంది. దీంతో ఆ స్టార్టప్కు టీహబ్లో ప్రతేకంగా స్థలాన్ని కేటాయించడంతోపాటు ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వలసకూలీలు, నిరక్షరాస్యులకు ఉపాధి అవకాశాలను కల్పించేలా ‘రోజ్గార్ కార్ట్’ను తీర్చిదిద్దే పనిలో ఉన్నట్టు సీఈవో మన్సూర్ అహ్మద్ తెలిపారు.