హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Rosaiah) మృతిపట్ల రాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతిక కాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. కాసేపట్లో అమీర్పేటలోని ఆయన నివాసానికి సీఎం చేరుకోనున్నారు. ఈనేపథ్యంలో సాధారణ పరిపాలన, ప్రొటోకాల్ అధికారులు రోశయ్య నివాసానికి చేరుకున్నారు.
రేపు గాంధీభవన్కు రోశయ్య భౌతికకాయం
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. అమీర్పేటలో ఉన్న ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలమైన గాంధీభవన్కు తరలించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీభవన్ నుంచి రోశయ్య అంతిమయాత్ర ప్రారంభమవనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.