హైదరాబాద్ : సామాజిక సేవారంగంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని, అలాంటి స్వచ్ఛంద సంస్థల పట్ల కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూడడం, నిధుల మంజూరు విషయంలో వివక్షత చూపడం బాధాకరమని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని బొగ్గులకుంటలో ‘శ్రీ’ మహిళా సంక్షేమ సంఘాన్ని, ఆ సంఘ లోగోను వినోద్ కుమార్ లాంఛనంగా ఆవిష్కరించారు.
సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మమేకమవుతున్న ఎన్జీవోలను ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఎన్జీవోల పట్ల ఉదారంగా వ్యవహరించాయని, కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్జీవోల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ నిధులు విడుదల చేయడం లేదని వినోద్ కుమార్ అన్నారు. మారుమూల ప్రాంతాల్లో సైతం ఎన్జీవో సంస్థలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
‘శ్రీ’ మహిళా సంక్షేమ సంఘం మహిళలు, చిన్నారుల కోసం తమవంతు సేవా కార్యక్రమాలను చేపట్టాలని వినోద్ కుమార్ సూచించారు. ‘శ్రీ’ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు గంగాపురం పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు పద్మాచారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్, గాయకులు ప్రణయ్ కుమార్, ప్రముఖులు స్వప్న, డాక్టర్ విజయ్ భాస్కర్, విజయేంద్ర రెడ్డి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.