Rohith Vemula | హైదరాబాద్/సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్: తన కొడుకు రోహిత్ వేములది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని ఆయన తల్లి రాధిక వాపోయారు. ‘నా కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. రోహిత్ది కచ్చితంగా హత్యే. నా కొడుకును చంపింది అప్పటి వీసీ అప్పారావే. పైకి ఆత్మహత్య అని వాళ్లు అంటున్నారు. హత్య అని నేను అంటున్న దానిపై విచారణ చేయాలి. అప్పుడు దళితుడు అని సోషల్ బాయ్కాట్ చేశా రు. ఇప్పుడేమో సోషల్ బాయ్కాట్ కాదంటున్నారు. నా కొడుకు దళితుడు కాదని అంటున్నారు. దానిపై కూడా విచారణ జరగాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. శనివారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్రెడ్డిని ఆమె కలిశారు. ఆధారాలు లేవని రోహిత్ కేసును క్లోజ్ చేస్తున్నారని, నిజాయితీగా విచారణ జరిపి బాధ్యులను జైలుకు పంపాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. రోహిత్తోపాటు సస్పెండైన విద్యార్థులపై కూడా కేసులు ఎత్తివేయాలని సీఎంకు విన్నవించారు. ఈ సందర్భంగా రోహిత్ వేముల కేసును పునర్విచారణ చేయించాలని సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఆదేశించినట్టు ఆమెకు తెలిపారు. అనంతరం రోహిత్ తల్లి వేముల రాధిక మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కొడుకును చంపింది వీసీ అప్పారావే. అప్పుడు ఇప్పుడు అదే చెబుతున్నా. ఆ రోజు ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఇప్పుడేమో రోహిత్ వేముల దళితుడు కాదని అంటున్నారు. అది చాలా దుర్మార్గం. నా ఉసురు తప్పకుండా తగులుతుంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
‘నేను రోహిత్ కన్నతల్లి, దళితురాలిని. నా కడుపున పుట్టిన బిడ్డ దళితుడు కాదా?’ అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. కావాలనే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ కేసులో రోహిత్ దళితుడు కాదని చెప్పడానికి పోలీసులకు అథారిటీ లేదు. కలెక్టర్, ఎమ్మార్వో దానిని నిర్ధారించాలి. పోలీసులే కోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇది చెల్లదు’ అని ఆమె చెప్పారు. నాటి గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే రోహిత్ వేముల ‘దళిత్’ అని సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. రోహిత్ చాలా మెరిట్ స్టూడెంట్ అని, ఒకవేళ అతనివి ఫేక్ సర్టిఫికెట్లే అయితే.. అవన్నీ బయటపెట్టాలని రాధక డిమాండ్ చేశారు. ‘రోహిత్ రెండుసార్లు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యాడు. ఇప్పటికీ రోహిత్ రిజర్వేషన్ను వాడుకోకుండా అన్నీ జనరల్లోనే పాసయ్యాడు. జనరల్లోనే సీట్లు సంపాదించాడు. మోదీలాంటి ఫేక్ సర్టిఫికెట్లు కావు నా కొడుకువి. అవి నిజమైన సర్టిఫికెట్లు’ అని అన్నారు.
‘నా కొడుకు చావుకు కారకులైన వారందరికీ శిక్ష పడే వరకు పోరాడుతా’నని రోహిత్ వేముల తల్లి రాధిక వేముల చెప్పారు. శనివారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద వర్సిటీ విద్యార్థి సంఘాల విద్యార్థులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. హెచ్సీయూ క్యాంపస్లో కొందరు కులవివక్షకు గురి చేయడంతోనే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, కానీ, పర్సనల్ ప్రాబ్లమ్స్తో ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ పోలీసులు కేసును క్లోజ్ చేసినట్టు తెలిసిందని వాపోయారు. కొంతమంది పోలీసులు బీజేపీకి అనుకూలంగా విచారణ చేపట్టారని ఆరోపించారు.
రోహిత్ కేసులో బీజేపీ నేతలను కాపాడేందుకే రాష్ట్ర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. బీజేపీ నేతలు, హెచ్సీయూ వైస్ చాన్స్లర్పై ఉన్న కేసులను ఎత్తివేయించడానికే పోలీసులు రోహిత్ వేముల కులంపై కలెక్టర్ తన నిర్ణయాన్ని ప్రకటించకముందే హడావుడిగా నివేదికను హైకోర్టుకు సమర్పించినట్టు పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా కేసు మూసివేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో, ఈ కేసును పునర్విచారణ చేపడుతున్నట్టు డీజీపీ ప్రకటించడాన్న తమ పార్టీ స్వాగతిస్తున్నదని తెలిపారు.
‘మా స్నేహితుడి చావుకు ఎవరు బాధ్యత వహిస్తారు? దోషులను ఎవ్వరు శిక్షిస్తారు? సరైన ఆధారాలు చూపకుండా కేసును ఎలా ముగిస్తారు?’ అంటూ రోహిత్ వేముల స్నేహితులు గళమెత్తారు. సైబరాబాద్ పోలీసులు కేసు ముగిసిందని వెల్లడించడంపై వాళ్లంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోహిత్ చావుకు కొందరు కారణం కాదని చెప్పడానికి పోలీసులు ఎవ్వరూ?’ అంటూ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి సీహెచ్ శేషయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తుది నివేదిక సమర్పించినప్పడు తమకు ఎలాంటి నివేదిక అందజేయలేదని ప్రధాన ఫిర్యాదుదారుడు సుంకన్న వేల్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును కూడా ఆశ్రయించకుండా తమకు న్యాయం నిరాకరిస్తే ఎలా అని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకుల సూచనల మేరకే ఈ కేసును పోలీసులు ముగించారని ఆరోపించారు. రోహిత్ కులంపై కొందరు చర్చలు పెట్టి అవమానిస్తున్నారని జనసేన స్టేట్ జనరల్ సెక్రటరీ పీ విజయ్కుమార్ చెప్పారు. రోహిత్ వేములకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు తెలిపారు.