బ్రిటిష్ పాలకుల ఆగడాలు, అన్యాయాలను ఎదిరించిన ధీశాలి. 500 మంది సిపాయిలతో కలిసి కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టడించిన సాహసి. పరిమిత ఆయుధ సంపత్తితో తెల్లవారికి ముచ్చెమటలు పట్టించిన దక్కన్ షేర్ఖాన్. తురుంఖాన్ పేరుతో ఇప్పటికీ ప్రజలనాలుకపై నానుతున్న హైదరాబాద్ పోరాట ఐకాన్ తుర్రేబాజ్ఖాన్.
1857..ఉత్తరాది సైనిక తిరుగుబాటు ప్రతిధ్వని హైదరాబాద్లో హోరెత్తింది. కుంభస్థలంలాంటి బ్రిటిష్ రెసిడెన్సీపై రొహిల్లాదళ నాయకుడు తుర్రేబాజ్ఖాన్ విరుచుకుపడ్డాడు. నిప్పులు కురిపించాడు. బ్రిటిష్వారికి చెమటలు పట్టించి, చుక్కలు చూపించాడు. మరఠ్వాడా ప్రాంతంలోని బుల్ఢానా సైనికులు ఉత్తరాది తిరుగుబాటు అణచివేతకు వెళ్లబోమని తిరగబడ్డారు. సహాయం దొరుకుతుందన్న ఆశతో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన జమేదార్ చీడాఖాన్ తిరుగుబాటు చేసి శిబిరాన్ని వదిలిపెట్టిన కొందరు సైనికులతో కలిసి హైదరాబాద్కు బయలుదేరాడు. తన అనుచరులతో హైదరాబాద్లోకి ప్రవేశించిన చీడాఖాన్ను మంత్రి సాలార్జంగ్ అరెస్టు చేయించి, రెసిడెంట్ వద్దకు పంపాడు. చీడాఖాన్ను రెసిడెన్సీలోని జైల్లో బంధించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున అసమ్మతికి దారితీసింది. 1857 జూలై 17న మక్కామసీదు వద్ద భారీ గుంపు జమ అయింది. రెచ్చగొట్టే ప్రసంగాలు జరిగాయి. రెసిడెన్సీలో బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు నిజాం వద్దకు నలుగురు మౌల్వీలను పంపాలని తీర్మానించారు. ఇది వీలుకాకపోతే రెసిడెన్సీపై దాడిచేయాలని కూడా నిర్ణయించారు. ఈ వార్తలు చేరడంతో రెసిడెన్సీ భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతకుముందే అదనపు బలగాలను రప్పించి ఉంచారు.
మక్కామసీదు వద్ద మధ్యాహ్నం పోగైన జనాలను అరబ్ గార్డుల సహాయంతో చెదరగొట్టినట్టు రెసిడెంట్కు అంతా సురక్షితం అన్నట్టుగా మంత్రి సాలార్జంగ్ సందేశం పంపాడు. చీడాఖాన్ను విడిపించుకోవాలనే లక్ష్యంతోనే అప్పటికే దేశభక్తిని గుండెల్లో నింపుకున్న తుర్రేబాజ్ఖాన్, మౌల్వీ అల్లాఉద్దీన్ కోఠీలోఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై 1857 జూలైలో దాడి చేశారు. సాయంత్రం 500 మంది రోహిల్లాలు తుర్రేబాజ్ఖాన్ నేతృత్వంలో రెసిడెన్సీపైకి విరుచుకుపడ్డారు. వారు రెసిడెన్సీకి పక్కనే ఉన్న అబ్బన్ సాహెబ్, జై గోపాల్ దాస్ అనే ఇద్దరు షావుకార్ల బంగళాలను ఆక్రమించుకుని వాటి పై అంతస్థుల నుంచి కాల్పులు ప్రారంభించారు. కానీ, దాడి గురించిన సమాచారాన్ని నిజాం మంత్రి తురబ్ అలీ ఖాన్ బ్రిటిషర్లకు చేరవేశాడు. గోడను ధ్వంసం చేసి రెసిడెన్సీలోకి తుర్రేబాజ్ఖాన్ సారథ్యంలో తిరుగుబాటు దారులు ప్రవేశించగానే బ్రిటిష్ సైన్యం సాయుధులై ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నారు.
బ్రిటిష్ సైనికాధికారులు భారీగానే ఎదురుకాల్పులు జరిపారు. తుర్రేబాజ్ఖాన్ ఆయుధ సంపత్తి పరిమితం. బ్రిటిష్ దళాల దగ్గరున్న ఆయుధాల ముందు అవి ఎంతమాత్రమూ సరిపోవు. బంగళాల పైనుంచి జరిగే కాల్పుల అండతో కొందరు రెసిడెన్సీ గేట్లను చుట్టుముట్టి వాటిని పేల్చివేశారు. రాత్రంతా రెండువైపులా బీభత్సంగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. జూలై 18 తెల్లవారుజాముకు అంతా సద్దుమణిగిపోయింది. 25 నుంచి 32 మంది దాకా తిరుగుబాటుదారులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో నాలుగు మృతదేహాలు మాత్రమే లభించాయి. తుర్రేబాజ్ ఖాన్ తప్పించుకున్నాడు. మౌల్వీ కనిపించకుండా పోయాడు. నిజాం పంపిన అరబ్ దళాలు ఆలస్యంగా వచ్చి చుట్టుపక్కల ఇళ్లను అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం రొహిల్లాలు వాడుకున్న రెండు బంగళాలను బ్రిటిష్వారు ధ్వంసం చేశారు. తప్పించుకున్నవారి తలలపై బహుమానాలు ప్రకటించారు. మౌల్వీ, తుర్రెబాజ్ఖాన్కు చెందిన అస్తులను స్వాధీనపర్చుకున్నారు.
ఆయన ఆచూకీని మరో సారి మంత్రి తురబ్ అలీ ఖాన్ జులై 22న ఆంగ్లేయులకు పంపాడు. కంటి దగ్గర మరకతో తుర్రేబాజ్ఖాన్ను గుర్తించి మొగిలిగిద్దలో పట్టుకున్నారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన తుర్రేబాజ్ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. మౌల్వీ మంగళ్పల్లిలో పట్టుబడ్డాడు. ఇద్దరినీ విచారణ జరిపి అండమాన్స్ దీవులకు పంపి ప్రవాస శిక్ష విధించారు. మౌల్వీ అక్కడే 1884 ప్రాంతంలో మరణించాడు. తుర్రేబాజ్ఖాన్ మాత్రం ప్రవాసశిక్షకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. అతనికి కాపలాగా ఉన్న ఇద్దరు గార్డులు కూడా అతనితోపాటే పారిపోయారు. అనంతరం తూప్రాన్ సమీపంలోని ఓ అడవిలో జనవరి 24న తాలూక్దార్ మీర్జా ఖుర్బాన్ అలీ బేగ్ సారథ్యంలోని సైన్యం కాల్చి చంపింది. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వరకు ఈడ్చుకు వచ్చారు. రెసిడెన్సీ బిల్డింగ్ సమీపంలో ఓ చెట్టుకు ఆయన మృతదేహాన్ని గొలుసులతో నగ్నంగా వేలాడదీశారు. ఇంకెవ్వరూ ఇంతటి సాహసం చేయవద్దనే ఉద్దేశంతో బెదిరించడానికి ఈ పనిచేశారు. ఇప్పుడు అదే ప్రాంతంలో తుర్రేబాజ్ఖాన్ను స్మరించుకునేందుకు ఓ స్మారకం నిర్మించారు.