హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా రాష్ట్రంలోని రోడ్ల మరమ్మతులను పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula ) అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష(Review) నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పీరియాడికల్ రెన్యువల్ రోడ్ల మరమ్మతుల పనుల పురోగతిపై ఆయన చర్చించారు.
ముందస్తుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం జూన్ నాటికి అన్ని పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ప్రతీవారం తానే స్వయంగా రోడ్ల వర్క్ ప్రోగ్రెస్ పరిశీలిస్తానని అధికారులతో అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న పలు వంతెనలు, ఆర్వోబీ, ఆర్యూబీ పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.హుస్సేన్ సాగర్ తీరాన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్(Ambedkar secretariat), 125అడుగుల అంబేద్కర్ విగ్రహం, అమర వీరుల స్మారక చిహ్నం పనుల పురోగతిపై చర్చించారు.
ప్రారంభ తేదీలు ముఖ్యమంత్రి కేసిఆర్(CM KCR) ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో తుదిదశ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని వెల్లడించారు. ఈ సమీక్షలో ఈఎన్సీ గణపతి రెడ్డి, సీఈ సతీశ్, దివాకర్, డీసీ రోడ్స్, ఎస్.ఈ సత్యనారాయణ, ఆర్ అండ్ బీ అధికారులు పాల్గొన్నారు.