హైదరాబాద్, జనవరి 7: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రహదారులకు సంబంధించిన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణం నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
శుక్రవారం అరణ్య భవన్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోడ్ల నిర్మాణం, వివిధ అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, (పీసీసీఎఫ్) ఆర్.శోభ, ఎమ్మెల్సీ దండే విఠల్ ఎమ్మెల్యేలు, దయాకర్ రావు, రేఖా శ్యాంనాయక్, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.డోబ్రియల్, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాలుగు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్ ఆదిలాబాద్ సీఎఫ్, డీఎఫ్ వోలు, ఎఫ్ డీవోలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. రహదారుల నిర్మాణానికి సంబంధించి యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ, అటవీ అనుమతులు, వివిధ శాఖల మధ్య సమన్వయం, పెండింగ్ పనులు, తదితర విషయాలపై సమగ్ర చర్చించారు.
నియోజకవర్గ స్థాయిలో శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే రోడ్ల నిర్మాణ పనులల్లో ఆలస్యం జరగుతుందని, ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎక్కడ పెండింగ్ ఉన్నాయో వివరాలు కూడా తెలియడం లేదన్నారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల గిరిజన ప్రాంతాల్లోరోడ్ల నిర్మాణ ఆలస్యమవుతుందని తెలిపారు.
రోడ్ల నిర్మాణం, అటవీ ప్రాంత గ్రామాల్లో కుంటల నిర్మాణం, అటవీ అనుమతులు, పెండింగ్ లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేలు వివరించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..రోడ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్ సమస్యలను జిల్లాల వారీగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో త్వరగా సమస్యలు పరిష్కారించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి నుంచి సరియైన రూపంలో ప్రతిపాదనలు పంపిస్తే సమయం వృథా కాదన్నారు.
గిరిజన ప్రాంతాల్లో కొన్ని చోట్ల అనారోగ్యాలకు గురైతే అంబులెన్స్ లు రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, అధికారులు మానవతా దృక్పతంతో వ్యవహరించాలని మంత్రి సూచించారు.