నదులను పట్టించుకోకుంటే భవిష్యత్తు అంధకారమే
వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్
సీఎం కేసీఆర్ సంకల్పంతో గోదావరి నదికి పునరుజ్జీవం
నదుల పరిరక్షణకు కేంద్రం చేసింది శూన్యం
నదుల పరిరక్షణ సదస్సులో మంత్రి నిరంజన్రెడ్డి
కాళేశ్వరంతో గోదావరి సజీవం
సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో రాష్ట్రంలో నదులకు పునరుజ్జీవం కల్పిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరినది సజీవంగా మారింది. నదులు ఉన్నచోటే మానవ నాగరికత అభివృద్ధి చెందుతుంది. తెలంగాణలో నదులు కలుషితం కాకుండా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది.
–మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 26 : నదులు నాలాల స్థాయికి పడిపోతే నాశనాన్ని కోరితెచ్చుకొన్నట్టే అవుతుందని వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ తీవ్రంగా హెచ్చరించారు. ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నదుల పరిరక్షణపై రెండురోజుల జాతీయ సదస్సు రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అధ్యక్షతన శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ దేశంలోని చాలా నదులు వ్యర్థాలతో కలుషితం అవుతున్నా కేంద్రప్రభుత్వం ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడంలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిగొప్ప నీటిపారుదల ప్రాజెక్టు అని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కేసీఆర్ గొప్ప సంకల్పంతో రాష్ట్రంలో నదులకు పునరుజ్జీవం కల్పిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నది సజీవంగా మారిందని పేర్కొన్నారు. నదులు ఉన్నచోటే మానవ నాగరికత అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణలో నదులు కలుషితం కాకుండా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నదని చెప్పారు.
ప్రతిపల్లెలో పచ్చదనం
సీఎం కేసీఆర్ చేపట్టిన అద్భుత పథకాలతో తెలంగాణలోని ప్రతిపల్లె పచ్చదనంతో నిండిపోయిందని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. అడవుల్లో పచ్చదనాన్ని పెంచడం, ప్రభుత్వ భూముల్లో, పొలాల గట్లమీద, ఇండ్ల పరిసరాల్లో ఖాళీగా ఉన్న ప్రతిచోటా మొక్కల పెంపకం చేపట్టామని వివరించారు. హరితహారం కార్యక్రమం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని, చాలా రాష్ర్టాల్లో ఈ పథకాన్ని అమలుచేస్తున్నారని తెలిపారు. ఎనిమిదేండ్లలో మూడుశాతం పచ్చదనాన్ని పెంచామని, రాష్ట్రం ఎంత ముందుచూపుతో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. పచ్చదనాన్ని పెంచటం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయని తెలిపారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఒకప్పుడు కరువు విపరీతంగా ఉండేదని, ప్రజలు వేరే దేశాలకు, ప్రాంతాలకు వలసలు వెళ్లేవారని, ఇప్పుడు వారంతా మళ్లీ తెలంగాణకు తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు.
నదులు నాలాలుగా మారొద్దు..
నదులు నాలాలుగా మారితే భవిష్యత్తు అంధకారమవుతుందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ హెచ్చరించారు. చదువుకున్న వారు అధికంగా ఉన్నచోటే నదులు కాలుష్యానికి గురవుతున్నాయని అన్నారు. నదులను నిర్లక్ష్యం చేస్తే ప్రకృతి వినాశనానికి నాంది పలికినట్టేనని స్పష్టంచేశారు. నదుల పరిరక్షణ అందరి బాధ్యత అని తెలిపారు. నదులకు కూడా మనిషిలాగా ఓ హోదాను కల్పించాలని సూచించారు. జాతీయ మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ నదుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు సాంకేతిక విధానాలను అనుసరించాలని రాజ్యాంగంలో ఉన్నదని, దానిని ఎవరూ అమలు చేయడం లేదని అన్నారు. సదస్సులో సుజల భారతి జర్నల్, వెబ్సైట్ను ఆవిష్కరించారు.
ప్రమాదపుటంచున నదులు
ఇష్టారాజ్యంగా అడవుల నరికివేత, నీటి వినియోగం, అక్రమ మైనింగ్, వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోవడంతో దేశంలోని నదులన్నీ కాలుష్య కాసారాలుగా మారుతున్నాయని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సు రెండో సెషన్లో రాజేంద్రసింగ్ రూపొందించిన రివర్ మ్యానిఫెస్టోపై చర్చించిన తరువాత ‘మీ నది గురించి తెలుసుకో’ అనే అంశంపై పలువురు నిపుణులు అభిప్రాయాలు వెల్లడించారు. ప్రభుత్వాలకు నదుల పరిరక్షణపై పట్టింపు లేకుండా పోయిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కేంద్రీకృత విధానాలవల్ల నష్టమేతప్ప ప్రయోజనం లేదని స్పష్టంచేశారు. సదస్సులో అమిత్ శ్రీవాత్సవ ప్రదర్శించిన గంగా నది నృత్యరూపకం ఆహూతులను అలరించింది. సమావేశంలో ఐహెచ్ఆర్బీసీ చైర్మన్ ఇందిరా ఖురానా, సుజల భారతి వెబ్సైట్ ఇన్చార్జి శ్వేత జున్జున్వాలా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజినీర్ (రిటైర్డ్) ఐఎస్ఎన్ రాజు, కృష్ణా రివర్ ఫ్యామిలీ చైర్మన్ ఎం శ్యామ్ప్రసాద్రెడ్డి, తెలంగాణ సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఇతర రాష్ర్టాల ప్రతినిధులు గురుమూర్తి, సత్యనారాయణ, రాజు, స్నేహాల్ దౌండే, వనితా మోహన్, ప్రశాంత్ చౌదరి పాల్గొన్నారు.