నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జీర్ణోద్ధారణ చేసిన రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయంలో శిలా మయ, లోహమయమూర్తి ధ్వజస్తంభ యంత్ర ప్రతిష్ఠాపన, మహా కుంభాభిషేకం కార్యక్రమాలలో భాగంగా రెండవ రోజైన ఆదివారం ప్రాతఃకాల ఆరాధనతో కార్యక్రమాలు మొదలయ్యాయి. సేవాకాలం, ద్వారా తోరణ ధ్వజ కుంభ ఆరాధన, చతుఃస్థానార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిర్వహించబోయే కార్యక్రమాలలో తెలిసో తెలియకో జరిగే అపరాధాలనుంచి విముక్తి కల్పించాలని కోరుతూ నిష్టతో భూదేవతకు వాస్తు పూజ, క్షమారాధన నిర్వహించారు.
రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి మూర్తి స్థాపనకు అనువైన స్థలాన్ని ఆమోదించమని నివేదన చేశారు. అరణి మధనం చేసి యజ్ఞం క్రతువుకు శ్రీకారం చుట్టారు. అగ్ని ప్రతిష్ట చేసి కల్వకుంట్ల కవిత దంపతులు, కుటుంబ సభ్యులు యాగం నిర్వహించారు. మూలమంత్ర మూర్తికి సంబంధించిన మంత్ర హవనాలనును శాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఛాయాధివాసం, వాస్తు శాంతి, వాస్తు పర్యగ్నీకరణం చేసి భూమాత ఆశీస్సులు పొందారు. పంచ సూక్తం పరివార ప్రాయశ్చిత్త హవనము మంగళా శాసనాలతో ముగించారు.
సాయంకాలం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి నరసింహ స్వామి ప్రీతి యజ్ఞంతో పాటు, మూల మంత్ర, మూర్తి మంత్ర హవనాలు నిర్వహించారు. ప్రతిష్టించనున్న విగ్రహాలకు పవిత్ర జలాధివాసం వేడుకగా నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలను, వివిధ నదుల నుంచి తీసుకువచ్చిన మంత్రజలాలను జలాధివాసం క్రతువులో వినియోగించారు. ఏడాది క్రితం ప్రారంభించిన మూల యంత్ర తపజపాలు నిర్విఘ్నంగా వేద ఘనాపాఠీల పర్యవేక్షణలో సాగాయని, పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిత్య పూజలు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఆలయ ప్రణాళికను పరిపుష్ఠం చేస్తున్నట్టు ఈ దార్మిక క్రతువు ప్రధాన అర్చకులు వేదాల భార్గవ నరసింహ స్వామి తెలిపారు.
పూర్ణాహుతి అనంతరం మంగళా శాసనాలు, వేద విన్నపాలు, శాత్తుమోరై, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులందరికీ నరసింహస్వామి ఉపాసకులు వేదాల భార్గవనరసింహస్వామి చేతుల మీదుగా నరసింహ మాలనదించారు. ఉదయం 6 గంటల నుండి 9:30 గంటల వరకు నిర్వహించిన ఈ ధార్మిక క్రతువులు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ఈరోజు ఆలయాన్ని దర్శించిన ప్రముఖుల్లో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, శాసనసభ్యులు జీవన్ రెడ్డి, షకీల్ అహ్మద్, నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్, మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి తదితరులు ఉన్నారు.