హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): యాసంగి వడ్ల మిల్లింగ్ ద్వారా వచ్చే బియ్యం మొత్తాన్ని ఎఫ్సీఐకి పంపించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. ధాన్యం ఎక్కువ సమయం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సీఎస్ నేతృత్వంలో శుక్రవారం బీఆర్కే భవన్లో సమావేశమైంది. యాసంగి వడ్ల మిల్లింగ్తో ఎన్ని కిలోల బియ్యం వస్తుంది? నూక ఎంత వస్తుంది? అనే అంశాలపై చర్చించారు. ముందుగా వచ్చిన బియ్యం మొత్తాన్ని ఎఫ్సీఐకి తరలించాలని, ఎంత గ్యాప్ ఉన్నదో పరిశీలించి, దాన్ని ఎలా భర్తీ చేయాలన్నదానిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుందామని తెలిపారు. ధాన్యం సేకరణలో గోనే సంచుల కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించాలని, రాష్ట్రంలో పలుచోట్ల చెడుగొట్టు వానలు పడుతున్నందు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని సూచించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, పౌసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.